Site icon NTV Telugu

Justice Yashwant Varma Resigns: సంచలన నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

Yashwant Varma

Yashwant Varma

Justice Yashwant Varma Resigns : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను సమర్పించారు. తన నివాసంలో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు లభించాయన్న వివాదం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం అనంతరం గతంలో ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇక జస్టిస్ వర్మ 2025 ఏప్రిల్ 5న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆ పదవిలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, తన రాజీనామాకు గల కారణాన్ని వెల్లడించలేదు. “ఈ లేఖను సమర్పించడానికి నన్ను ప్రేరేపించిన కారణాలను మీ గౌరవనీయ కార్యాలయానికి వెల్లడించాలని నేను కోరుకోవడం లేదు. అయినప్పటికీ, తీవ్ర విచారంతో నేను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను.” అని రాసుకొచ్చారు.

READ MORE: Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు

జస్టిస్ యశ్వంత్ వర్మ చుట్టూ అల్లుకున్న వివాదం ఏంటి?
2025 మార్చి 14న, ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాస స్టోర్‌రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో పెద్ద మొత్తంలో నగదును బయటపడింది. పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత కాలిపోయింది. నగదు బయటపడిన తర్వాత, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వర్మను పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ వివాదం కారణంగా, 2025 మార్చి చివరిలో జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయన మాతృ సంస్థ అయిన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే ఇన్ని పరిణామాలు జరిగినా.. జస్టిస్ వర్మ తన పదవికి రాజీనామా చేయడానికి ఇష్టపడలేదు. ఫలితంగా, పార్లమెంటులో ఆయనపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించారు. అభిశంసన తీర్మానంపై లోక్‌సభకు చెందిన 146 మంది సభ్యులు సంతకాలు చేశారు. న్యాయమూర్తులపై విచారణ జరిపేందుకు లోక్‌సభ స్పీకర్ ఈ చట్టం కింద ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు, బహుశా మరో మార్గం కనిపించకపోవడంతో జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు.

Exit mobile version