SP Ranganath: ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దర్యాప్తు అధికారి నల్గొండ మాజీ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఈ తీర్పుతో ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నానని, సంతోషపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు ఏకంగా ఏడేళ్ల పాటు సాగిందని, 1600 పేజీల ఛార్జ్షీట్ తయారు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనాలసిస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు. మొత్తం 67 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశామని చెప్పారు.
Read Also: Justice For Pranay: కన్న కూతురు, కొడుకులను చంపే వాళ్లకు తీర్పు కనువిప్పు కావాలి
పరువు హత్య, కాంట్రాక్ట్ హానర్ కిల్లింగ్ కేసును చాలెంజ్గా తీసుకొని దర్యాప్తు జరిపాం. ప్రాసిక్యూషన్ టీమ్, మా పోలీస్ బృందాలన్నీ నిరంతరం పర్యవేక్షణలో పనిచేశాయి. 2018లోనే ఈ కేసు కష్టతరమని భావించి, హానర్ కిల్లింగ్ కేసును సీరియస్గా తీసుకున్నట్లు అని ఎస్పీ రంగనాథ్ గుర్తు చేశారు. కేసు విచారణలో కీలకంగా A1 ముద్దాయి మారుతీరావుతోనూ మాట్లాడినట్లు వెల్లడించారు. పరువు హత్య సరికాదని, ప్రణయ్ కూడా ఓ తల్లిదండ్రులకు కొడుకే అని గుర్తు చేసినట్లు తెలిపారు. మారుతీరావు మాత్రం తన కూతురు కోసం, తన పరువు పోతుందనే భావనతో హత్యకు పాల్పడినట్లు తెలిపారు.
హత్య అనంతరం నిందితులు తప్పించుకునేందుకు పకడ్బందీగా ప్రయత్నించినప్పటికీ, పోలీస్ బృందాలు వారిని వెంటాడి పట్టుకున్నాయని వెల్లడించారు. మేము ఈ కేసులో ఒక లక్ష్యంతో పని చేశామని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. ఈ కేసులో సాక్షాలు దొరకకపోయినా.. సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి దర్యాప్తు కొనసాగించామని చెప్పారు. నిందితులు సాక్షులను ప్రభావితం చేయకుండా, దర్యాప్తును చాలా జాగ్రత్తగా నిర్వహించాము. కేసు విచారణలో ఎలాంటి తప్పులూ దొర్లకుండా చూసుకున్నామన్నారు. ప్రణయ్ హత్య కేసులో కరుడుగట్టిన నేరగాళ్లు అస్గర్ అలీ, అబ్దుల్లా బారీ ఇన్వాల్వ్ అయ్యారు. వారిని కూడా పట్టుకొని విచారించాము. నిందితులు రైలులో పారిపోక ముందే మన బృందాలు వారిని పట్టుకున్నాయని వివరించారు.
కేసు దర్యాప్తు పట్ల అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ, మా బృందం కఠినంగా పనిచేసింది. ఒక లక్ష్యంతో, ప్రాపర్గా కేసు బిల్డ్అప్ చేశాం. ఈ రోజు గౌరవ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మర్డర్స్ చేస్తే శిక్ష తప్పదని ఈ తీర్పు ద్వారా రుజువైందని ఏవీ రంగనాథ్ అన్నారు.