Site icon NTV Telugu

OP Services: నేడు రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్

Junior Doctors

Junior Doctors

OP Services: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్‌కు జూడాలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14వ తేదీన ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి జూడాలు నోటీసులు అందించారు. నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు.

Read Also: CM Revanth Reddy : గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

కోల్‌కతాలో యువ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలిపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. బాధితురాలి మర్మాంగాలు, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్లు, చేతులు, గోళ్లకు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇది ఆత్మహత్య కాదని.. కచ్చితంగా లైంగిక దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక, కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ రెసిడెంట్ డాక్టర్ హత్య కేసులో సంజయ్‌ రాయ్‌ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పోలీసులకు అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్న నిందితుడు.. తన పోకిరి చేష్టలతో తరుచూ ఇబ్బందులకు గురిచేసేవాడని తెలిసింది. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్‌తో సోమవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేశారు. దీంతో దేశంలోని అనేక నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రం వైద్యులు మినహాయింపు ఇచ్చారు. ఇక, ఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు.. తన జూనియర్లతో కలిసి భోజనం చేసి, సెమినార్ రూమ్‌కి వెళ్లింది. మర్నాడు ఉదయం అక్కడ ఆమె విగతజీవిగా కనిపించింది.

Exit mobile version