ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వర్సెస్ టెస్ట్ క్రికెట్ వివాదంపై ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో కాక్స్ సభ్యుడిగా ఉన్నారు. అయితే, ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాకపోయినప్పటికీ.. ఐపీఎల్ ప్రయాణం తన జీవితాన్ని మార్చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా కోహ్లీ గురించి కాక్స్ మాట్లాడుతూ.. “కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్గా ఉంటాడో, సహచర ఆటగాళ్లకు అంతగా సహాయం చేస్తాడు. తన మెదడులో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని పంచుకుంటూ అవతలి వారికి నేర్పించడానికి ప్రయత్నిస్తాడు. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడి నుండి నేను దీనిని అస్సలు ఊహించలేదు. క్రికెట్లో సాధించాల్సింది అంతా సాధించినప్పటికీ, తన అనుభవాన్నంతా యువ ఆటగాళ్లకు అందించేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నెట్స్లో విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం” అని కాక్స్ వివరించారు.
ఐపీఎల్ అనుభవంపై స్పందిస్తూ.. “ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్. టెస్ట్ క్రికెట్ అనేది అన్నిటికంటే పెద్దదే, అందులో రాణించాలని నాకు ఉంది. కానీ ఐపీఎల్లో ప్రపంచ స్థాయి ఆటగాళ్ల మధ్య ఉంటూ నేర్చుకునే అవకాశాన్ని నేను వదులుకోలేకపోయాను. ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా, ఈ టోర్నమెంట్లో భాగం కావడం నా కల నిజమవ్వడమే” అని 25 ఏళ్ల జోర్డాన్ కాక్స్ పేర్కొన్నారు. ఈ సీజన్లో జోర్డాన్ కాక్స్ తుది జట్టులో ఆడనప్పటికీ, పలు మ్యాచ్ల్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చారు.
