Ragging Shocks JNTU Nachupally Campus in Jagtial: చక్కగా చదువుకోమని కాలేజీలకు పంపిస్తే.. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు విద్యార్థులు.. తాజాగా జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. “ఇంట్రాక్షన్” పేరుతో సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కాలేజీలో భయానక వాతావరణం నెలకొంది. బాధితుల వివరాల ప్రకారం, కొంతమంది రెండో సంవత్సరం విద్యార్థులు కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులను “ఇంట్రాక్షన్” అనే పేరుతో మానసికంగా వేధించారు. విద్యార్థులను అవమానకరమైన ప్రశ్నలు అడగడం, గట్టిగా అరిచి మాట్లాడడం, భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. ఈ వేధింపుల వల్ల కొందరు జూనియర్ విద్యార్థులు భయంతో తరగతులకు హాజరు కాలేదు.
READ MORE: Bandi Sanjay: హెచ్సీఏ సెలెక్షన్ కమిటీపై బండి సంజయ్ ఆగ్రహం.. త్వరలో యాక్షన్..!
ఘటనపై కళాశాల అధికారులు, యాజమాన్యం స్పందించకపోవడం తల్లిదండ్రుల్లో ఆగ్రహం రేపింది. పిల్లలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని అధికారుల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్పై ప్రభుత్వం, యూనివర్సిటీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ఇలాంటి ఘటనలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా, కాలేజీలో భద్రతా చర్యలు పెంచాలని విద్యార్థి సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
READ MORE: Bengaluru: ఇది జైలా గెస్ట్ హౌస్ హా..? ఉగ్రవాది, సీరియల్ కిల్లర్కు మొబైల్, టీవీ, ‘VIP’ సౌకర్యం..!
