భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా ఆయన ఎడమ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత లార్డ్స్ వన్డేకు దూరమైన బుమ్రా, బెంగళూరులోని బీసీసీఐ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వద్ద పునరావాసం పొందుతున్నారు. ఫిట్నెస్ పరీక్షను బట్టి ఆయన ఎంపిక ఆధారపడి ఉన్నప్పటికీ, కోలుకునే క్రమంలో ఇంకా అసౌకర్యం ఉండటంతో సెలెక్టర్లు ఆయనను జట్టు నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. రాబోయే కీలకమైన క్రికెట్ షెడ్యూల్ దృష్ట్యా ఆయన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత రెండేళ్లలో స్వదేశంలో రెండు టెస్టు సిరీస్లు కోల్పోయి, విదేశీ పర్యటనల్లోనూ మిశ్రమ ఫలితాలు సాధిస్తూ పరివర్తన దశలో ఉన్న భారత టెస్టు జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బ. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్గా ఉన్న 32 ఏళ్ల బుమ్రా, 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వెన్నుగాయానికి గురైనప్పటి నుంచి బోర్డు ఆయన పనిభారాన్ని (వర్క్లోడ్) అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులకు గాను కేవలం మూడింటిలోనే ఆడించారు. అలాగే ఇటీవల ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే జూన్లో అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టుకు కూడా విశ్రాంతి ఇచ్చారు.
బుమ్రా గైర్హాజరీతో శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా బౌలింగ్ విభాగంలో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో భారత జట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్కు చెందిన పేస్ ఆల్రౌండర్ ఆకిబ్ నబీకి జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత జట్టు ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో మొదటి టెస్టు మ్యాచ్ ఆడనుంది.

