Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!

Earthquake

Earthquake

Japan Earthquake: జపాన్ దక్షిణ ప్రాంతంలోని కగోషిమా ప్రాంతంలో బుధవారం (మే 20) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా పలు భవనాలు ఒక్కసారిగా కంపించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంప ప్రభావం ఒకినావా ప్రధాన ద్వీపం సమీప ప్రాంతాల్లో కూడా తీవ్రంగా అనిపించింది.

అయితే భూకంపం అనంతరం అధికారులు ప్రజలకు కొంత ఊరటనిచ్చారు. ప్రస్తుతం సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఏదీ లేదని వెల్లడించారు. అయినప్పటికీ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. భౌగోళికంగా జపాన్ ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

ఇటీవల కూడా జపాన్‌లో వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. కాగోషిమా భూకంపానికి నాలుగు రోజుల ముందు, జపాన్ ప్రధాన ద్వీపమైన హోన్షు తూర్పు తీర ప్రాంతంలో మరో బలమైన భూకంపం సంభవించింది. ఆ సమయంలో తోహూకు ప్రాంతంలో అత్యవసర హెచ్చరికలు జారీ చేయగా, కొన్ని గంటల పాటు రైలు సేవలను కూడా నిలిపివేశారు. అయితే ఆ ఘటనలో కూడా ఎలాంటి భారీ నష్టం జరగలేదు.