Varahi Yatra 2nd Phase: మొదటి దశ వారాహి విజయ యాత్ర విజయవంతంగా పూర్తి చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, రెండో దశ యాత్రకు సిద్ధం అయ్యారు.. ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభం కానుంది. 9న ఏలూరులో పవన్ కల్యాణ్ సభ జరుగుతుంది. రెండోదశ యాత్ర ప్రణాళికపై ఈరోజు జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. గత 14 న అన్నవరంలో తొలిదశ ప్రారంభమైంది. ఈనెల 9న ఏలూరు సభతో రెండో దశ వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజక వర్గ నేతల్ని సేనాని కలుస్తారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై వారితో మాట్లాడుతారు.
Read Also: PM Modi Warangal Tour : ప్రధాని మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇలా..!
కాగా, తొలి దశ వారాహి యాత్రలో పవన్ కల్యాణ్.. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. సీఎం నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇలా ఎవరినీ వదలకుండా విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కామెంట్లకు అదే స్థాయిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు పడ్డాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పవన్ కామెంట్లపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. అయితే, ఎవ్వరు విమర్శించినా.. వారిపై మళ్లీ విమర్శలు గుప్పించారు జనసేనాని.. మరి రెండో దశ వారాహి విజయయాత్రలో ఎలాంటి.. అస్త్రాలు సంధిస్తారో.. వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, రేపు మరోసారి పార్టీ నేతలతో భేటీ కానున్నారు పవన్.. ఏలూరు సభ అనంతరం వారాహి యాత్ర రూట్ మ్యాప్ ఖరారుపై చర్చించనున్నారు.. దెందులూరు, తాడేపల్లి గూడెం, తణుకు, ఉంగుటూరు, ఉండి, నిడదవోలు వంటి నియోజకవర్గాల్లో పర్యటన ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి జనసేన శ్రేణులు.