Jeevan Reddy: జగిత్యాల రాజకీయం కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీనీ వీడేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక 27 నుంచి గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామాల్లో తిరుగుతూ పార్టీ మార్పుపై ప్రజలను అడిగి అభిప్రాయం తెలుసుకోనున్నారు. తనకు జరిగిన అన్యాయం.. పార్టీ ఫిరాయింపులపై ప్రజలకు వివరించాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఏప్రిల్ 10 లోపు బీర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కి లేదా ఫార్మ్ హౌస్ కి రావాలని బీఆర్ఎస్ వర్గాలు కోరినట్లు సమాచారం. జగిత్యాలలో బహిరంగసభ ఏర్పాటు చేసి చేరతానని.. కేసీఆర్ రావాలని జీవన్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటికే పలు దఫాలుగా జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించారు. మంత్రులు వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది.