బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మార్కెట్ను టార్గెట్ చేస్తూ ప్రముఖ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన కొత్త ఐటెల్ ఏ300సీ 4జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ దీనిని కేవలం 10,999 రూపాయల ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. “బిల్ట్ ఫర్ రియల్ లైఫ్” అనే నినాదంతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 6000mAh బ్యాటరీ. ఇది రోజంతా నాన్స్టాప్ గా ఫోన్ వాడకానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా.. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించడం ద్వారా త్వరగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. డిస్ప్లే పరంగా ఇందులో 6.56 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్ ఉంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ డిజైన్ చాలా స్లిమ్గా, తేలికగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.
పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్లో యూనిసోక్ టీ7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్పై పనిచేస్తుంది. అలాగే ఇందులో 12GB వరకు ఎఫెక్టివ్ ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది. ఫోన్ కిందపడినా లేదా రోజూవారీ వాడకంలో ఎదురయ్యే ఇబ్బందులను సులభంగా తట్టుకునేందుకు ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ మిలటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ టెస్టింగ్తో దీనిని రూపొందించారు.
కొనుగోలుదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కంపెనీ ఈ ఫోన్ కొనుగోలు చేసిన మొదటి 100 రోజుల్లో ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 8 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. మెరుగైన ఆడియో అనుభూతి కోసం డీటీఎస్-ఎన్హాన్సెడ్ సౌండ్ ఎఫెక్ట్స్ అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా.. ఇందులో ఇచ్చిన ఐఆర్ రిమోట్ సెన్సార్తో టీవీ, ఏసీ వంటి వాటిని ఫోన్ ద్వారానే రిమోట్లా నియంత్రించుకోవచ్చు.

