Site icon NTV Telugu

Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..

Israel

Israel

ఇజ్రాయెల్ మరోసారి రెచ్చిపోయింది. బుధవారం నాడు లెబనాన్‌లోని 100కు పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం కేవలం “10 నిమిషాల వ్యవధిలో” విరుచుకుపడింది. ప్రస్తుత దాడుల పరంపరలో ఇదే అతిపెద్ద దాడి అని సైన్యం ప్రకటించింది. బీరూట్, బెకా వ్యాలీ మరియు దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైనిక ప్రకటన పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి హిజ్బుల్లా ఉపయోగిస్తున్న కమాండ్ సెంటర్లు , మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు సైన్యం తెలిపింది. అయితే.. ఇజ్రాయెల్ చేసిన ఈ ప్రకటనపై హిజ్బుల్లా ఇప్పటివరకు స్పందించలేదు.

మరోవైపు.. ఇరాన్‌తో అమెరికా రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మంగళవారం ప్రకటించిన కొన్ని గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధాన్ని ముగించి.. శాంతిని నెలకొల్పేందుకు ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ మధ్యవర్తులు ఈ ఒప్పందం లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని చెబుతుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం దీనిని తోసిపుచ్చారు. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ.. హిజ్బుల్లా ఇప్పటికీ కాల్పుల విరమణకే కట్టుబడి ఉంది.

Also Read:Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ లో ‘శివగామి’.. ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్!

దక్షిణ లెబనాన్‌లోని సిడాన్ నగరంపై జరిగిన దాడిలో ఎనిమిది మంది మరణించగా.. 22 మంది గాయపడ్డారని లెబనాన్ మీడియా వెల్లడించింది. 2024 నవంబర్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, ఈ ఏడాది మార్చి 2న హిజ్బుల్లా జరిపిన సరిహద్దు దాడి తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ విమాన దాడులు , భూతల దాడులను ముమ్మరం చేసింది. లెబనాన్ అధికారుల లెక్కల ప్రకారం.. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు కనీసం 1,530 మంది మరణించగా, 4,812 మంది గాయపడ్డారు. పౌర ప్రాంతాలపై జరుగుతున్న ఈ దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Exit mobile version