Site icon NTV Telugu

Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!

Hormuz Conflict

Hormuz Conflict

Iran Ship Tax: మధ్యప్రాచ్యంలో యుద్ధం సద్దుమణుగుతున్న తరుణంలో, ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తూ ఇరాన్ నయా వార్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇంతకీ అది ఏంటంటే.. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకం విధించడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఈ రోజు పాకిస్థాన్‌లో జరిగే అమెరికా-ఇరాన్ చర్చల సందర్భంగా ఈ అంశంపై ఇరాన్ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. వాస్తవానికి అమెరికా – ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని దాదాపుగా క్లోజ్ చేసింది. ఈ జలసంధిని కేవలం ‘శత్రువుల’ కోసం మాత్రమే క్లోజ్ చేశామని గతంలో ఇరాన్ చెప్పుకొచ్చింది. తాజాగా ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కింద హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్నప్పటికీ, ఈ మార్గం గుండా పూర్తి స్వేచ్ఛా రాకపోకలకు ఇరాన్ సుముఖంగా లేదు.

READ ALSO: Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!

యుద్ధ నష్టాలకు పరిహారంగా ఓడలపై సుంకాలు విధించాలని ఇరాన్ చెబుతోంది. ఒక్కో ఓడపై 2 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేయవచ్చని పలు నివేదికలు సూచిస్తుండగా, కొన్ని ప్రాంతాలలో ఒక్కో బ్యారెల్ చమురుపై 1 డాలర్ వరకు ఛార్జీలు విధించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ లేదా చైనీస్ యువాన్‌లో చెల్లింపులను అంగీకరించే ప్రతిపాదనలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతర్జాతీయ సముద్ర చట్టం ప్రకారం.. ఏ సహజ సముద్ర మార్గంపైనా సుంకాలు విధించరాదని ఈయూ పేర్కొంది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. “ఈ కీలకమైన జలమార్గాన్ని ఏ విధంగానైనా ఆయుధంగా ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదు. ఈ జలసంధిని పూర్తిగా, ఎటువంటి షరతులు లేకుండా తెరవాలి” అని స్పష్టం చేసింది. ఇరాన్ ప్లాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి కొంత భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ టోల్ విధానాన్ని అమెరికా- ఇరాన్‌లు “ఉమ్మడి భాగస్వామ్యం”కింద నిర్వహించవచ్చని ఆయన సూచించారు. ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వైట్‌హౌస్ స్పష్టం చేసినప్పటికీ, ఎలాంటి అంతరాయం లేకుండా జలసంధిని వెంటనే తిరిగి తెరవాలని అమెరికా కోరుకుంటోంది.

హోర్ముజ్ జలసంధి వెంబడి ఒమన్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో అది కూడా కీలక పాత్ర పోషించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నౌకలు ప్రయాణించడానికి వీలు కల్పించి, దీంతో ఇరాన్‌కు ఆదాయాన్ని సమకూర్చే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ – ఒమన్ కలిసి పనిచేయవచ్చని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది జరిగితే ఇరాన్ ఏటా 70 నుంచి 90 బిలియన్ డాలర్ల వరకు సంపాదించగలదని అంచనా. అందుకే కొంతమంది నిపుణులు దీనిని ఇరాన్ అణు కార్యక్రమం కంటే “మరింత ముఖ్యమైనది”గా భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై గల్ఫ్ దేశాలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ తదితర దేశాలు సముద్ర మార్గంపై ఇరాన్‌కు అటువంటి నియంత్రణ ఇవ్వకూడదని భావిస్తున్నాయి. లా నియంత్రణ ఇస్తే అది ఈ ప్రాంతంలో అధికార సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆయా దేశాలు వాదిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు హోర్ముజ్ జలసంధి అనేది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, అది ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేంద్రంగా మారింది. ఇరాన్ ప్లాన్ చేస్తున్న ఈ సుంకం విధానాన్ని ప్రపంచం అంగీకరిస్తుందా, లేదా ఈ వివాదం ముదిరి కొత్త ఉద్రిక్తతలను సృష్టిస్తుందా అనేది రాబోయే రోజులే నిర్ణయిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Origin of Gold: బంగారం ఎలా పుట్టిందో తెలిసిపోయింది.. సముద్రం అడుగున ఉన్న ‘గోల్డ్ ఫ్యాక్టరీ’కి దారి ఇదే!

Exit mobile version