Site icon NTV Telugu

Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?

Iran

Iran

Iran: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నుంచి అనూహ్యమైన, అత్యంత కీలకమైన ప్రకటన వెలువడింది. దశాబ్దాలుగా సాగుతున్న అణు వివాదానికి తెరదించేలా ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసింది. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. తాజాగా ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఖతీబ్జాదే చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. అమెరికా నుంచి సరైన, గౌరవప్రదమైన ‘ఆఫర్’ వస్తే, తమ దేశం అణు కార్యక్రమాన్ని పూర్తిగా ముగించడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. స్కై న్యూస్ అరేబియా ఈ మేరకు ఒక నివేదికను ప్రచురించింది. ఈ నివేదికలో ఉన్న కీలకమైన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Nitish Kumar: రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రకటించిన బిహార్ సీఎం.. ప్రస్థానం చూస్తే పరేషాన్ కావాల్సిందే!

శాంతి కోసం 12 దేశాల రాయబారం
గతంలో ఇరాన్ కేవలం “యురేనియం సుసంపన్నతను తగ్గించడం” గురించి మాత్రమే మాట్లాడేది. కానీ, చరిత్రలో మొదటిసారిగా మొత్తం అణు కార్యక్రమాన్నే రద్దు చేస్తామని అధికారికంగా ప్రతిపాదించడం గమనార్హం. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, ఒక ఒప్పందానికి తీసుకురావడానికి 12 మధ్యప్రాచ్య దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ చర్చలకు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఒమన్, సౌదీ అరేబియా కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తూ, ఇరాన్‌తో ఒప్పందం కుదిరేలా ప్రయత్నిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే అమెరికా – ఇరాన్ ప్రతినిధులు జెనీవా, ఒమన్‌లలో రహస్యంగా భేటీ అయ్యారని వెల్లడించింది.

ఇరాన్ అణు నిల్వలు ఎంత అంటే..
డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇరాన్ అణు సామర్థ్యం ఎంత ఉందంటే..

యురేనియం నిల్వ: ప్రస్తుతం ఇరాన్ వద్ద 460 కిలోగ్రాముల శుద్ధి చేసిన యురేనియం ఉంది.

విధ్వంసక శక్తి: ఈ నిల్వలతో సుమారు 11 అణు బాంబులను తయారు చేసే అవకాశం ఉంది.

శుద్ధి శాతం: ప్రస్తుతం ఈ యురేనియం 60% వరకు శుద్ధి చేశారు. అణ్వాయుధం తయారీకి ఇది 90% కి చేరాల్సి ఉంటుంది.

ఇరాన్- అమెరికా మధ్య చారిత్రక ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో ఇరుపక్షాల నుంచి కీలక నేతలు పాల్గొంటున్నారు. ఇరాన్ తరపున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, ఉప మంత్రి ఖతీబ్జాదే పాల్గొంటున్నారు. అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ చర్చల్లో పాల్గొనే వారిలో ఉన్నారు.

ఇది యుద్ధానికి ముగింపా..
అమెరికా దాడులు తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఇరాన్ ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. ఒకవేళ అమెరికా ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే, మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గి, శాంతి నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అమెరికా ఇచ్చే ‘ఆఫర్’ ఎలా ఉంటుందనే దానిపైనే ఈ ఒప్పంద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. చూడాలి అమెరికా- ఇరాన్ ఇచ్చిన ఆఫర్‌పై ఎలా స్పందిస్తుందో అనేది.

READ ALSO: Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!

Exit mobile version