Site icon NTV Telugu

IPL Legend Players: అసలైన ఐపీఎల్ దిగ్గజాలు.. 2008 నుంచి 18 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్న 7 మంది సూపర్‌స్టార్లు!

Ipl

Ipl

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభానికి రోజులే మిగిలి ఉన్నాయి. తొలి మ్యాచ్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పుడే 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. ఐపీఎల్ అసలైన దిగ్గజాలు.. 18 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్న 7 మంది సూపర్‌స్టార్లు గురించి ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఐపీఎల్‌లో అందరి కళ్లు ధోనీపైనే ఉన్నాయి. 44 ఏళ్ల వయసులోనూ మైదానంలో మెరుపులు మెరిపించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధమవుతున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టిన ధోనీ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు. ధోనీ ఒక్కడే కాదు.. లీగ్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పట్టు వదలని విక్రమార్కుడిలా మరో ఆరుగురు ప్లేయర్స్ దుమ్ము రేపుతున్నారు. వారు ఎవరో కాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే ఏటా ఐపీఎల్ సీజన్‌లో భాగస్వామ్యం వహించగా.. అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా మాత్రం వివిధ కారణాల వల్ల మధ్యలో కొన్ని సీజన్లకు దూరమయ్యారు.

READ MORE: Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!

విరాట్ కోహ్లీ: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీకి ప్రత్యేకత ఉంది. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 18 ఏళ్లలో ఆర్సీబీ తరఫునే ఆడుతుండటం విశేషం. ఎప్పటి నుంచో కప్పు కొట్టాలని ఉర్రూతలుగిన విరాట్‌కు గతేడాది విజయం వరించింది. 2025లో ఆర్సీబీ కప్పు కొట్టింది. అంతేకాదు.. మొత్తం అన్ని ఐపీఎల్ సీజన్లలో కలిసి ఇప్పటి వరకు 267 మ్యాచులు ఆడిన విరాట్ 8,661 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోన టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఎంఎస్ ధోనీ: ఇక ధోనీ జర్నీ చూస్తే.. ముందు నుంచి ధోనీ చెన్నై తరఫునే ఉన్నాడు.. కానీ 2016-17లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మాత్రం రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరపున ఆడాడు. ఆ రెండేళ్లు మినహా ధోనీ ప్రస్థానమంతా సీఎస్‌కేతోనే ముడిపడి ఉంది. తన సారథ్యంలో ఐదుసార్లు జట్టును విజేతగా నిలిపిన ధోనీ, 278 మ్యాచ్‌ల్లో 5,439 పరుగులు సాధించడమే కాకుండా కీపర్‌గా 158 క్యాచ్‌లు, 47 స్టంపింగ్స్‌తో రికార్డు సృష్టించాడు. ఈసారి జట్టులో సంజూ శామ్సన్ కూడా వికెట్ కీపర్‌గా ఉండటంతో ధోనీ పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

హిట్ మ్యాన్: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2008 నుంచి తన ఐపీఎల్ ప్రస్థానాన్ని కొనసాగిస్తు్న్నాడు. మొదట్లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. 272 మ్యాచ్‌ల్లో 7,046 పరుగులు చేసిన రోహిత్, ఈసారి కూడా కేవలం ఆటగాడిగానే తన పవర్‌ను చూపించనున్నాడు.

ఇక ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన మనీష్ పాండే, ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటివరకు 7 వేర్వేరు జట్ల తరపున ఆడిన అనుభవం మనీష్ సొంతం. ఇక స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన పాత గూడైన రాజస్థాన్ రాయల్స్‌లోకి తిరిగి చేరాడు. 2010లో నిబంధనల ఉల్లంఘన కారణంగా ఒక సీజన్ నిషేధానికి గురైనప్పటికీ, 254 మ్యాచ్‌ల్లో 3,260 పరుగులు, 170 వికెట్లతో జడ్డూ అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా కొనసాగుతున్నాడు. అజింక్యా రహానే విషయానికొస్తే, ఈసారి కేకేఆర్ జట్టును కెప్టెన్‌గా నడిపించే బాధ్యతను అందుకున్నాడు. 198 మ్యాచ్‌ల అనుభవమున్న రహానే, 2010లో ఆడే అవకాశం రాకపోయినా, పట్టుదలతో తన కెరీర్‌ను 5,000 పరుగుల మైలురాయి దాటించాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున తన స్పెల్స్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 2012లో గాయం వల్ల, 2018లో వేలంలో ఎవరూ కొనకపోవడం వల్ల ఆయన కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇలా 2008 నుంచి ఇప్పటి వరకు వరుసగా మ్యాచులు ఆడుతూ వస్తున్న దిగ్గజాలు ఈ సీజన్‌లో ఎలా అడతారు? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version