ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం రాత్రి తెలిపింది. తొలి మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరు, కోల్కతా మధ్య జరుగుతుంది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. మే 29న క్వాలిఫైయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్-2 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఐపీఎల్ 2025 నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, భద్రతా సంస్థలు, టోర్నీ వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత ఐపీఎల్ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
మొత్తంగా ఆరు వేదికల్లో మిగిలిన ఐపీఎల్ 2025 మ్యాచ్లు జరుగుతాయి. టోర్నీలో ఇంకా 17 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 24న జైపూర్లో రద్దు చేయబడిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను తిరిగి నిర్వహించనున్నారు. లీగ్ దశ మే 27న ముగుస్తుంది. ప్లేఆఫ్లు మే 29న ప్రారంభమవుతాయి. బెంగళూరు, లక్నో, జైపుర్, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబైలో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్ల వేదికల వివరాలను త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. అయితే హైదరాబాద్లో జరగాల్సిన రెండు మ్యాచ్లను బీసీసీఐ తరలించింది. పాత షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ మే 25న జరగాల్సి ఉంది.