Punjab Kings: మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌.. పీఎస్‌ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్‌కి!

  • మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌
  • పీఎస్‌ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్‌కి మిచెల్
  • 80 పరుగుల ఇన్నింగ్స్ మిచెల్ కెరీర్‌ను మార్చింది
Mitchell Owen Glenn Maxwell

Mitchell Owen Glenn Maxwell

చేతి వేలి గాయం కార‌ణంగా పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ జట్టులోకి తీసుకుంది. మిచెల్‌ను రూ.3 కోట్లకు పంజాబ్ తీసుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025లో మిచెల్ ఆడుతుండడం విశేషం.

మే 9 వరకు పీఎస్‌ఎల్ 2025లో మిచెల్ ఓవెన్‌ ఆడనున్నాడు. అనంతరం ఐపీఎల్ 2025 కోసం పంజాబ్ కింగ్స్ జట్టులో చేరనున్నాడు. మరో లీగ్‌లో ఆడుతున్న ప్లేయర్.. ఇలా అర్ధాంతరంగా ఐపీఎల్‌కు రావడం ఇదే మొదటిసారి. మిచెల్‌కు ఇదే మొదటి ఐపీఎల్ సీజన్. బాబర్ అజామ్ కెప్టెన్సీలో పెషావర్ జల్మికి మిచెల్‌ ఆడుతున్నాడు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఐపీఎల్ కోసం పాకిస్తాన్ లీగ్‌ను వదులుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బాష్ లీగ్‌ 2025లో మిచెల్‌ అద్భుతంగా ఆడాడు.

Also Read: Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ‘గోట్’ ఆఫ్ ఐపీఎల్‌!

బిగ్ బాష్ లీగ్‌ 2025లో మిచెల్ ఓవెన్‌ ఆడుతున్నపుడు పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికి పాంటింగ్ కామెంటేటర్‌గా ఉన్నాడు. మిచెల్ ఆటను దగ్గరుండి చూసిన పాంటింగ్.. గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో పంజాబ్ జట్టులోకి తీసుకున్నాడని సమాచారం. మిచెల్ అద్భుత ఆల్ రౌండర్. మొదటలో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన అతడు.. ఓపెనర్‌గా మారాడు. ఇంట్రా క్లబ్ మ్యాచ్‌లో చేసిన 80 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్‌ను మార్చింది. 42 బంతుల్లో 108, 39 బంతుల్లో 100 పరుగులు చేసి స్టార్ అయ్యాడు. ఇక మాక్స్‌వెల్ ఐపీఎల్ 2025లో 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.