PBKS vs DC: పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ మధ్యలోనే రద్దు.. స్టేడియం నుంచి ఫ్యాన్స్ బయటికి పరుగులు!

  • పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ మధ్యలోనే రద్దు
  • పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ రద్దు
  • స్టేడియం నుంచి ఫాన్స్ బయటికి పరుగులు
Pbks Vs Dc Match Called Off

Pbks Vs Dc Match Called Off

ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. బ్లాక్ ఔట్ కారణంగా స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. తక్షణమే ప్రేక్షకులను స్టేడియం వీడి వెళ్లిపోవాలని అధికారులు సూచన చేశారు. దాంతో మైదానంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫాన్స్ అందరూ బయటికి పరుగులు తీశారు.

పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ఔట్ అవుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో కూడా బ్లాక్ ఔట్ అయింది. స్టేడియంలోని ఓ ఫ్లడ్ లైట్ చెడిపోయింది. స్టేడియంలో ఫ్లడ్ లైట్ సమస్య తలెత్తడంతో పాటు భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు ఉన్నపళంగా రద్దు చేశారు. ఆటగాళ్లను కూడా వెంటనే ధర్మశాల స్టేడియం నుండి బయటకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది.

మ్యాచ్ రద్దయ్యే సమయానికి పంజాబ్‌కింగ్స్‌ 10.1 ఓవర్లకు 1 వికెట్‌ నష్టపోయి 122 పరుగులు చేసింది. ప్రియాంశ్‌ ఆర్య (70) హాఫ్ సెంచరీ బాదాడు. ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (50), శ్రేయస్‌ అయ్యర్‌ (0) క్రీజులో ఉన్నారు. ప్రియాంశ్‌ ఆర్య 25 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. 28 బంతుల్లో ప్రభుసిమ్రన్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ బౌలర్ దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టాడు.