Virat Kohli React on Two Months Vaccation ahead IPL 2024: గత రెండు నెలలు భారత్లో లేనని.. తనని, తన ఫ్యామిలీని గుర్తుపట్టని ప్రాంతంలో సమయాన్ని గడిపామని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. లండన్లో కుటుంబంతో కలిసి సాధారణ సమయాన్ని గడిపానని. ఆ అనుభవం అవాస్తవంగా అనిపించిందన్నాడు. కుటుంబ కోణం నుంచి చూస్తే విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని విరాట్ పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో విరాట్ సతీమణి అనుష్క శర్మ అకాయ్కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రసవ సమయంలో భార్య పక్కన ఉండేందుకు విరాట్ రెండు నెలలు క్రికెట్కు దూరమయ్యాడు.
సోమవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6) కీలక పాత్ర పోషించాడు. ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న విరాట్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ నుంచి లభిస్తున్న మద్దతుపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘చిన్నస్వామి మైదానంలో అభిమానుల మధ్య కలిసి ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతున్నా. అయితే ఆటలో సాధించిన ఘనతలు, గణాంకాలు, నంబర్స్, రికార్డులు గురించి ప్రజలు మాట్లాడుతుంటారు. కానీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే.. కనిపించేవి జ్ణాపకాలే. రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ఇదే చెబుతుంటాడు. ఆడే సమయంలో ప్రాణం పెట్టి ఆడాలని చెప్పేవాడు. అందరి నుంచి ప్రేమ, ప్రశంసలు, మద్దతు అందుకోవడం అద్భుతంగా ఉంది’ అని విరాట్ అన్నాడు.
Also Read: Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!
‘రెండు నెలలు భారత్లో లేను. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రాంతంలో ఉన్నాం. కుటుంబంతో కలిసి సాధారణ సమయాన్ని గడిపా. ఆ అనుభవం అవాస్తవంగా అనిపించింది. వాస్తవానికి ఇద్దరు పిల్లలను కలిగి ఉండటం, కుటుంబ కోణం నుంచి విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిల్లలతో బంధం ఎంతో బాగుంటుంది. కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. రోడ్లపై మరొక వ్యక్తిగా తిరగడం, ఎవరూ నను గుర్తించబడకపోవడం అద్భుతమైన అనుభవం. ఇక్కడ కూడా ఇదే కోరుకుంటున్నా. ఇక కుటుంబ పరంగా ఇద్దరు పిల్లలని కలిగి ఉండటం సంతోషకరమై విషయం’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.