IPL 2024: ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టాలు తప్పవా?

Ipl

Ipl

BCCI’s Rule Change Ahead Of IPL 2024 Auction: 17వ సీజన్‌ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాట్, బాల్‌ మధ్య పోటీని పెంచేందుకు బీసీసీఐ కొత్త రూల్ తీసుకొస్తుందట. ఒక ఓవ‌ర్లో రెండు బౌన్స‌ర్లు సంధించేందుకు బౌలర్లకు అనుమ‌తిస్తారట. దాంతో బంతిని దంచుడే లక్ష్యంగా పెట్టుకున్న ప‌వ‌ర్ హిట్ల‌ర్ల‌కు క‌ళ్లెం ప‌డ్డ‌ట్టే. ఈ కొత్త రూల్‌పై పలువురు బౌలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధన బౌలర్లకు కలిసొస్తుందని పేసర్ జయదేవ్ ఉనద్కత్ అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది జ‌రిగిన స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు బౌన్స‌ర్ల‌ నిబంధనను బీసీసీఐ అమలు చేసింది. ఈ నిబంధ‌న సక్సెస్ కావడంతో ఐపీఎల్‌ 2024లోనూ దీన్ని అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను బీసీసీఐ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్ ప్రకారం.. తుది జట్టుతో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను టాస్ సమయంలోనే ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నలుగురిలో ఎవరినైనా జట్టులోకి వచ్చి ఆడే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్‌లో త్వ‌ర‌గా వికెట్లు ప‌డగానే స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్‌ను, బౌలింగ్ అవసరం అనుకుంటే స్పెష‌లిస్ట్ బౌలర్‌ను కెప్టెన్లు ఆడించారు. ఇది కొన్ని జట్లకు కలిసొచ్చింది కూడా. ఈసారి తీసుకొస్తున్న రెండు బౌన్స‌ర్ల రూల్ బౌల‌ర్ల‌కు ఏమేర ఉప‌క‌రిస్తుందో చూడాలి.

Also Read: Rishabh Pant IPL Auction: ఐపీఎల్ లీగ్ చ‌రిత్ర‌లోనే తొలి కెప్టెన్‌గా రిషబ్ పంత్ రికార్డు!

ఐపీఎల్ 2024 వేలం మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత్ ప్లేయర్స్ కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఖాళీలు మాత్రం 77 ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. 17వ సీజ‌న్‌ మినీ వేలం దుబాయ్ వేదిక‌గా జరగనుంది. ఫేమ‌స్ ఆక్ష‌నీర్ మ‌ల్లికా సాగ‌ర్ నిర్వ‌హించే వేలంలో కోట్లు కొల్ల‌గొట్టేది ఎవ‌రు? అని అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది.