NTV Telugu Site icon

Srisailam Inflow: శ్రీశైలానికి తగ్గిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

Srisailam

Srisailam

Srisailam Inflow: శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 2,91,003 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,22,768 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 60,232 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటమట్టం బుధవారం మధ్యాహ్నం సమయానికి 884.50 అడుగులు, నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం నుంచి విడుదల అవుతున్న నీటి ప్రవాహాలను సందర్శకులు, యాత్రికులు తిలకించి తమ చరవాణిల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో జలాశయం రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి.

Read Also: Pawan Kalyan: పిఠాపురం మహారాజా మేనకోడలు, కుమారుల ఆవేదన.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీశైలం జలాశయం నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో నాగార్జున సాగర్‌ జలకళను సంతరించుకుంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో సాగర్ డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌కు లక్షా 70వేలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 524.4 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 157.42 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ డ్యాం నుంచి 6వేల 732 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.