తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా ‘ఇందిరమ్మ భీమా’ పథకాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత భీమా రక్షణ కల్పించనున్నారు. కుటుంబంలో ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్తు సంభవించినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ భీమా మొత్తం ఎంతో దోహదపడుతుంది.
మహిళా సాధికారతకు పెద్దపీట..
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మహిళా స్వయం సహాయక సంఘాలకు (పొదుపు సంఘాలకు) రూ.1 లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. దీనికి అదనంగా మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం.. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ‘ఇందిరమ్మ భీమా’ ద్వారా రాష్ట్రంలోని కోటిన్నర కుటుంబాలకు మరింత ధీమాను కల్పించబోతోంది.
