Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…

Sushmitha

Sushmitha

ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పార్టీలోని అంతర్గత పరిణామాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో తమ ఇంటికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని గుర్తుచేశారు. సీఎం పదవిలో ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వారిని తక్కువ చేసి మాట్లాడకూడదని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని ఆమె ఘాటుగా స్పష్టం చేశారు.

దీంతో పాటు.. రాజకీయాల్లో తన సొంత భవిష్యత్తుపై స్పష్టతనిస్తూ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు పూర్తి అర్హతలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. పార్టీ స్థాపన, అభివృద్ధిలో తమ కుటుంబం చేసిన త్యాగాలను వివరిస్తూ, తమకు జరుగుతున్న అన్యాయంపై మౌనంగా ఉండేది లేదని తెలిపారు. అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతానని సీఎం వర్గానికి, పార్టీ నాయకత్వానికి ఆమె స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.

తాజాగా దీనిపై గాంధీ భవన్‌లో కాంగ్రెస్ మహిళా నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, కొండా సుష్మితపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సుష్మితా.. మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించిన ఆమె, సుష్మిత వైఖరిని, ప్రవర్తనను పూర్తిగా తప్పుబట్టారు. కొండా సురేఖ తమ అక్క కాబట్టి, ఆ బంధాన్ని గౌరవిస్తూనే కొండా సుష్మితకు ఒక అక్క కూతురిగా మర్యాద ఇస్తున్నామని చెప్పారు. అయితే అసలు సుష్మిత పార్టీలో ఉందా లేదా అన్నది స్పష్టం చేయాలని సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి మాట్లాడకపోతే ఇంకెవరి గురించి మాట్లాడతారని ప్రశ్నిస్తూ, పార్టీ లైన్‌లో ఉండి పని చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు.

సుష్మిత మాట్లాడే తీరు ఆమె తల్లిదండ్రుల పెంపకాన్నే ప్రశ్నించేలా ఉందని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. సినిమాలు చూసి డ్యామేజీ సింపుల్ డైలాగులు కొట్టడం రాజకీయాల్లో నడవదని స్పష్టం చేశారు. సుష్మిత వెనక ఉండి బీఆర్ఎస్ లేదా బీజేపీ నేతలు ఇలా మాట్లాడిస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పదవి తన తల్లికి దక్కిందంటే అది ఆమె కుటుంబానికి, సామాజిక వర్గానికి వచ్చిన గౌరవమే కదా అని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఏ పదవులు లేకపోయినా, వారిని వివాదాల్లోకి గురిచేయడం సరికాదన్నారు. గతంలోనే కొండా సురేఖ ఒకసారి క్షమాపణలు చెప్పారని, ఇప్పుడు మళ్లీ ఇలాంటి వివాదాలు సృష్టించడం వల్ల పక్క పార్టీలకే అవకాశం ఇచ్చినట్లవుతుందని మండిపడ్డారు.

ఎవరికైనా చిట్టా ఉంటే దానిని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని, ఊరికే బెదిరింపులకు దిగకూడదని అన్నారు. పొలిటికల్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి అభిమానులు ఇలాంటి వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కౌంటర్ ఇస్తే మరింత రెచ్చిపోతానని సుష్మిత అంటున్నారని, అలా రెచ్చిపోతే పుచ్చిపోతావని గట్టిగా హెచ్చరించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన కార్యకర్తలకు పదవులు అడగాలి తప్ప, తనేం చేసిందని ఎమ్మెల్యే పదవి కోరుతోందో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదని, ఇకనైనా సుష్మిత తన తాటాకు చప్పుళ్లు కట్టిపెట్టి ప్రవర్తన మార్చుకోవాలని స్పష్టం చేశారు.