Site icon NTV Telugu

Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

Train Ticket Rules

Train Ticket Rules

Train Ticket Rules: ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి పలు కీలక చర్యలు తీసుకుంటోంది. పరిశుభ్రత, సమయపాలన, క్యాటరింగ్ సేవలతో పాటు టికెట్ బుకింగ్ విధానాన్ని కూడా ఆధునికీకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టికెట్ కన్ఫర్మేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సాంకేతిక, పరిపాలనా మార్పులు రైల్వే చేపట్టింది.

Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

రైల్వే ప్రయాణంలో కన్ఫర్మ్డ్ టికెట్ ఉంటే సీటు గ్యారంటీగా లభిస్తుంది. అయితే వెయిటింగ్ లిస్ట్ (WL), RAC (Reservation Against Cancellation) టికెట్లతో ప్రయాణించే వారికి టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే సందేహం ఉంటుంది. ఈ ఆందోళనను తగ్గించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ రిజర్వేషన్ చార్ట్ విధానంలో మార్పులు చేసింది. 2025 డిసెంబర్ 12న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ముందుగానే తమ టికెట్ స్థితి తెలుసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.

కొత్త రూల్స్ ప్రకారం ఉదయం 05:01 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు మొదటి రిజర్వేషన్ చార్ట్‌ ను ముందురోజు రాత్రి 8:00 గంటలకల్లా సిద్ధం చేస్తారు. ఇక మధ్యాహ్నం 2:01 నుంచి రాత్రి 11:59 వరకు, అలాగే అర్ధరాత్రి 12:00 నుంచి ఉదయం 5:00 మధ్య బయలుదేరే రైళ్లకు కనీసం 10 గంటల ముందు మొదటి చార్ట్‌ను తయారు చేస్తారు. మొదటి చార్ట్ తర్వాత ఫైనల్ లేదా రెండో రిజర్వేషన్ చార్ట్ కూడా విడుదల అవుతుంది. ఈ రెండో చార్ట్ సాధారణంగా రైలు బయలుదేరే సమయానికి సుమారు 30 నిమిషాల ముందు సిద్ధమవుతుంది. ఈ సమయంలో తత్కాల్ కోటాలో మిగిలిన ఖాళీలను RAC, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కేటాయిస్తారు.

Terror Module: రైళ్లను పేల్చేందుకు కుట్ర.. హిందూ నాయకులే టార్గెట్.. భారీ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు

అంతేకాకుండా ఫైనల్ చార్ట్ తయారీకి ముందు ఖాళీగా ఉన్న బెర్త్‌లను ప్రయాణికులు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు ముందుగానే స్పష్టత లభించి, వారి ప్రయాణ ప్రణాళిక సులభమవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. టికెట్ కన్ఫర్మేషన్ ప్రక్రియలో తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు ప్రయాణికుల ఆందోళనను తగ్గించి, రైల్వే సేవలను మరింత పారదర్శకంగా మార్చనున్నాయి.

Exit mobile version