Team India: 142 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. ఇంగ్లాండ్‌తో ఢీకొట్టబోతున్న టీమ్ ఇండియా..

Smruthi

Smruthi

టీ20 వరల్డ్ కప్ 2026 వైఫల్యం తర్వాత, భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. పురుషుల తొలి టెస్ట్ జరిగిన 142 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

లార్డ్స్ కల నిజమవుతోంది..
ఈ చారిత్రాత్మక మ్యాచ్‌పై భారత హెడ్ కోచ్ అమోల్ మజుందార్ హర్షం వ్యక్తం చేశారు. లార్డ్స్‌లో తొలి టెస్ట్ ఆడే అవకాశం రావడం అదృష్టమని, శ్వేత వర్ణ జెర్సీ ధరించి బరిలోకి దిగడం ప్రతి క్రీడాకారిణికి గర్వకారణమని ఆయన అన్నారు. భారత్ గతంలో మార్చి నెలలో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడింది.

భారత జట్టు మార్పులు..
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. గాయపడిన ప్రతీక రావల్ స్థానంలో ప్రియా పూనియా జట్టులోకి వచ్చింది. అలాగే హర్లీన్ డియోల్, స్పిన్నర్ శ్రీ చరణి, ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌పై ఆడిన గత నాలుగు టెస్టుల్లో భారత్ మూడింట్లో విజయం సాధించింది. అంతేకాదు.. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు.

టామీ బ్యూమాంట్ రిటైర్మెంట్..
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఐదుగురు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ ఓపెనర్ టామీ బ్యూమాంట్ ఈ టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఆమెకుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్లు..
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, ప్రియా పూనియా, హర్లీన్ డియోల్, శ్రీ చరణి, నందిని శర్మ, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, స్నేహ రాణా.

ఇంగ్లాండ్: నాట్ సివర్ బ్రంట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, హీథర్ నైట్, అలిస్ కాప్సే, సోఫీ ఎక్లెస్టోన్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, మేయా బూచియర్, లారెన్ ఫిలెర్, గ్రేస్ పాట్స్, ఎల్లీ థ్రెల్కెల్డ్, మ్యాడీ విలియర్స్, ఇస్సీ వాంగ్, టిల్లీ కోర్టెన్ కోల్‌మన్.