India vs Zimbabwe: దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా కేవలం 111 పరుగులకే కుప్పకూలడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా ఎడమచేతి వాటం బ్యాటర్లు ప్రత్యర్థి ఆఫ్-స్పిన్నర్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ దెబ్బతో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరగబోయే కీలక మ్యాచ్ కోసం టీమ్ మేనేజ్మెంట్ జట్టులో రెండు పెద్ద మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
READ ALSO: WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!
ఎవరిపై వేటు పడే అవకాశం ఉందంటే..
వరుసగా నాలుగు మ్యాచుల్లో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మను తదుపరి మ్యాచ్లో పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం లెఫ్ట్-హ్యాండ్ బ్యాటర్లే ఎక్కువగా ఉండటం టీమిండియాకు మైనస్గా మారింది. అందుకే వారి స్థానంలో రైట్-హ్యాండ్ బ్యాటర్లను తీసుకురావాలని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ వంటి వారు సూచిస్తున్నారు. చెన్నై వేదికగా జరిగే జింబాబ్వే మ్యాచ్లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ను ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల సంజూ రాకతో జట్టు బ్యాటింగ్ బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు మ్యాచులకు దూరంగా ఉన్న ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒత్తిడిలో బ్యాటింగ్తో పాటు, పొదుపుగా బౌలింగ్ చేయగల అక్షర్ జట్టుకు చాలా అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి..
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 177 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్గా ఉన్న ఇషాన్ కిషన్, దక్షిణాఫ్రికాపై మాత్రం డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ, అతని గత రికార్డు దృష్ట్యా అతనికి మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ భారత్కు ‘డూ ఆర్ డై’ లాంటిది. ఎందుకంటే భారత్ ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవడంతో పాటు భారీ రన్ రేట్ సాధించడం కూడా ముఖ్యం. మరి సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతారో వేచి చూడాలి.
READ ALSO: T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్ రన్ రేట్ దెబ్బకొడుతుందా?
