Former ICC chairman Ehsan Mani: టీ20 వరల్డ్ కప్ సమరం మొదలైంది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. పాకిస్థాన్-భారత్ మ్యాచ్ అంశంపై ఇంకా క్లారిటీ లేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఐసీసీ టోర్నీలకు పెద్ద ఆదాయ వనరు. ఈ అంశంపై ప్రస్తుతం పీబీసీ-ఐసీసీ మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహం మొదలైంది. నిన్నటి వరకు తెరవెనుక చర్చలకు స్వస్తి పలికిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా అధికారికంగా చర్చల బాట పట్టాయి. అయినా కూడా ఈ సమస్య తేలికగా పరిష్కారమయ్యేలా కనిపించడం లేదని మాజీ ఐసీసీ ఛైర్మన్ ఎహ్సాన్ మని చెప్పడం అభిమానుల్లో ఆందోళన పెంచింది. ఈ వివాదానికి ఒక్కరినే నిందించలేమని ఆయన స్పష్టం చేశాడు. అయితే రాజకీయ జోక్యమే ఈ మొత్తం గందరగోళానికి ప్రధాన కారణమని తెలిపాడు. భారత్తో మ్యాచ్ ఆడకూడదన్న పాకిస్థాన్ నిర్ణయం కోపం, నిరాశతో తీసుకున్నదని అంగీకరించాడు.
Revsportzతో మాట్లాడిన ఎహ్సాన్ మని.. తాను ఐసీసీ ఛైర్మన్గా ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. “నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే, తప్పకుండా పరిష్కారం కోసం ప్రయత్నించేవాడిని. ఏ జట్టునీ టోర్నీ నుంచి బయటకు నెట్టేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. పీసీబీ ఒక వైఖరి తీసుకుంది. కానీ మాట్లాడకుండా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చదు. బెదిరింపుల కంటే చర్చలే ముఖ్యం” అని మని అన్నాడు. అయితే ఈ ప్రయత్నం ఒక్క వైపు నుంచే కాకుండా రెండు వైపుల నుంచీ రావాల్సిందని స్పష్టం చేశాడు. జై షా నేతృత్వంలో ఐసీసీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి దాదాపు అందరూ మద్దతిచ్చారని, అందులో పాకిస్థాన్ మాత్రమే భిన్నంగా ఆలోచించిందని మని గుర్తు చేశాడు. సాధారణంగా బోర్డు నిర్ణయాలను అంగీకరించాల్సిందేనని చెప్పినప్పటికీ, పీసీబీ మాత్రం ఇది అన్యాయంగా, రాజకీయ ప్రభావంతో తీసుకున్న నిర్ణయంగా భావించిందని వివరించాడు. ఈ విషయం మొదట్లోనే పరిష్కరించి ఉండాల్సిందని, జై షా, నక్వీ నేరుగా మాట్లాడుకుని ఉంటే ఇంత దూరం వెళ్లేదే కాదని అభిప్రాయపడ్డాడు. పీసీబీ ఈ స్థానం తీసుకోవడానికి కారణం.. తమను పట్టించుకోవట్లేదనే భావనని మని చెప్పాడు. ఇప్పటికీ కొద్దిపాటి ఆశ మిగిలే ఉందని చెప్పినప్పటికీ, అది నిజం కావాలంటే అత్యున్నత స్థాయిలోనే చర్చలు జరగాలని స్పష్టం చేశాడు. “ఛైర్మన్ స్థాయిలో నేరుగా మాట్లాడితే తప్ప ఈ సమస్య తీరుతుందని నేను అనుకోవడం లేదు. జై షా స్వయంగా పాకిస్థాన్కు వెళ్లి మాట్లాడేందుకు ముందుకొచ్చి ఉంటే, అది చాలా మంచి సంకేతం అయ్యేది. నా కాలంలో నేను భారత క్రీడా మంత్రులతోనూ నేరుగా మాట్లాడాను” అని గుర్తు చేశాడు.
READ MORE: Jr NTR : ‘డ్రాగన్’ వేట మొదలైంది.. ఎన్టీఆర్.. ఎయిర్పోర్ట్ వీడియో వైరల్!
