IND vs NZ: హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు నాలుగో టీ20లో న్యూజిలాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్లో ఏకంగా 50 పరుగుల తేడాతో ఓడిపోవటంతో, ఈరోజు (జనవరి 31న) జరగనున్న ఐదో టీ20పై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్లోనూ భారత్ ఓడితే వరల్డ్ కప్కు ముందు జట్టు ఆత్మవిశ్వాసానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Astrology: జనవరి 31, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ఉత్సాహంగా న్యూజిలాండ్:
4వ టీ20లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్పై గెలిచింది. అదే జోరును కొనసాగించి సిరీస్ను గౌరవప్రదంగా ముగించాలని కివిస్ ఆశిస్తోంది. గత మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లు టీమిండియా బౌలర్లపై ఎదురు దాడి చేయడంతో 216 పరుగుల భారీ లక్ష్యా్న్ని పెట్టింది. ఓపెనర్లు సీఫర్ట్, డెవాన్ కాన్వేతో పాటు మిచెల్, ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. ఈ నలుగురిని కట్టడి చేయడంపైనే భారత గెలుపు ఆధారపడి ఉంది. కాగా, గత మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు భారీగా రన్స్ ఇచ్చారు. కానీ, ఇవాళ జరిగే మ్యాచ్లో బౌలర్లు ఎలా రాణిస్తారు అనేది కీలకం. ఇక, న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, శాంట్నర్లు టీమిండియా బ్యాటర్లకు ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది.
Read Also: Off The Record: ఐదేళ్ల పాటు ఆ ఎమ్మెల్సీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. ఇప్పుడు ఆయన ఆచూకీ లేదు..
సొంతగడ్డపై సంజూకు పరీక్ష
ఈ సిరీస్ ప్రారంభం నుంచి భారత్కు సంజూ శాంసన్ ఫామ్ పెద్ద ఆందోళనగా మారింది. ఈ మ్యాచ్లో అయినా అతడు తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. గత మ్యాచ్లో మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ భారీ స్కోరు చేయడంలో సంజూ ఫెయిల్ అయ్యాడు. చివరి టీ20 అతడి సొంత నగరమైన తిరువనంతపురంలో జరగడటంతో.. భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ఇది మంచి అవకాశంగా మారింది. అలాగే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. విశాఖలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబేపై అందరి దృష్టి పడింది. రింకూ సింగ్ కూడా మంచి ఫామ్లోనే ఉండగా.. గత మ్యాచ్కు దూరమైన ఇషాన్ కిషన్కు చివరి టీ20లో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది.
పిచ్, రికార్డులు
ఇక, తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనుంది. అలాగే, ఈ పిచ్ స్పిన్నర్లకూ సహకారం లభించేలా కనిపిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి.. ఈ గ్రౌండ్ లో భారత్ ఇప్పటి వరకు నాలుగు టీ20లు ఆడగా అందులో మూడు గెలిచి, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. అయితే, ఈ సిరీస్లో చివరి టీ20ని విజయంతో ముగించేందుకు భారత్ జట్టు పూర్తి శక్తితో బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది.
