IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టుకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమై 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

సాల్ట్ మెరుపులు:

టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ 21 బంతుల్లో 36 పరుగులు చేయగా.. చివర్లో సామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. భారత్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకోగా, హర్షిత్ రాణా కూడా 2 వికెట్లు దక్కించుకున్నాడు. లగే అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసినా 49 పరుగులు సమర్పించుకున్నాడు.

భారత్ వరుస వికెట్ల పతనం:

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ మంచి శుభారంభం అందించారు. అయితే 1.5 ఓవర్ వద్ద అభిషేక్ శర్మ 10 పరుగులకు ఔటవడంతో తొలి దెబ్బ తగిలింది. రెండు భారీ సిక్సర్లతో ఆకట్టుకున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 5 బంతుల్లో 13 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10) వరుసగా పెవిలియన్ చేరడంతో భారత్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 53/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా తిలక్ వర్మ (3), శివమ్ దూబే (2), హర్షిత్ రాణా (9), అర్ష్‌దీప్ సింగ్ (4), వరుణ్ చక్రవర్తి (5) లు కూడా వరుసగా విఫలమవడంతో భారత ఇన్నింగ్స్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు, విల్ జాక్స్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ విజయాన్ని మరింత ఘనంగా మార్చారు.

సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం:

ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. తర్వాతి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న ఆతిథ్య జట్టు సిరీస్‌పై పట్టు బిగించింది. మరోవైపు భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసే అవకాశాలు సజీవంగా ఉంటాయి.