జట్టు సమష్టి ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్లో గెలిచామని టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇదో అద్భుతమైన సిరీస్ అని, కుర్రాళ్లంతా పూర్తి ఆధిపత్యం చెలాయించారన్నాడు. చివరిదైన ఐదో టీ20 మ్యాచ్లో భారత్ 6 పరుగులతో ఆ్రస్టేలియాను ఓడించి సిరీస్ను 4-1తో ముగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో భారత్ సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఇది మంచి సిరీస్. మా కుర్రాళ్లు అందరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు అభినందనీయం. నిర్భయంగా ఉండాలనుకున్నాం. మధ్య ఓవర్లలో ఆటను ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. మా కుర్రాళ్లకు మీ ఆటను ఆస్వాదించండని సూచించాను. ఈ సిరీస్ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఉండి ఉంటే ఈ మ్యాచ్ మరింత సులువయ్యేది. చిన్నస్వామి స్టేడియంలో 200లకు పైగా లక్ష్యాన్ని కూడా సునాయసంగా చేధించవచ్చు. అయితే ఈరోజు 160-175 లక్ష్యాన్ని చేధించడం కష్టమైంది. 10 ఓవర్ల తర్వాత విన్నింగ్ రేసులో ఉన్నామని మా కుర్రాళ్లకు చెప్పాను’ అని తెలిపాడు.
Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు!
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. బెన్ మెక్డెర్మోట్ (54; 36 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు.