India summons US: గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడుల నేపథ్యంలో భారత్ సీరియస్ అయింది. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై యూఎస్ దాడి నేపథ్యంలో, ఈ వారంలో రెండోసారి అమెరికా దౌత్యవేత్త జసన్ మీక్స్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో భారత సిబ్బంది ఉన్న నౌకలపై మూడు సార్లు దాడులు చేసింది. ఈ ఘటనపై భారత్, అమెరికా దౌత్యవేత్త జాసన్ మీక్స్ను పిలిపించి చర్చించినట్లు తెలుస్తోంది. వరసగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే గల్ఫ్, హార్ముజ్ జలసంధి, సమీప సముద్ర ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది భారతీయ సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జూన్ 08న ఎంటీ మారివెక్స్ అనే నౌకపై దాడి జరగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నౌకలో ఉన్న 24 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 10న ఎంటీ సెట్టేబెల్లో అనే ట్యాంకర్ ఒమన్ తీరంలో దాడికి గురైంది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉంటే, 21 మంది సురక్షితంగా బయటపడగా, ముగ్గురు మరణించారు. గురువారం మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది.
ప్రస్తుతం హార్ముజ్ జలసంధికి సమీపంలో ప్రయాణిస్తున్న 13 భారత జెండా కలిగిన నౌకల్లో 622 మంది భారతీయ నావికులు ఉన్నారు. గల్ఫ్ ప్రాంతంలో వందలాది విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో దాదాపు 18 వేల మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద సముద్ర కార్మిక శక్తి భారత్దే. సముద్ర భద్రత ప్రమాదంలో ఉంటే ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.

