Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..

Afghanistan

Afghanistan

ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును పురుషుల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనుండగా, హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తుది జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చిన మేనేజ్‌మెంట్, బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. కాగా సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ జట్టులో వికెట్ కీపర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఆల్‌రౌండర్ల విభాగంలో శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్‌లకు స్థానం దక్కింది. స్పిన్ అటాక్‌ను వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ నడిపించనున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.