Putin: గత ఐదు దశాబ్ధాలుగా భారత సైనిక ఆధునీకీకరణలో రష్యా కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. వైమానిక రక్షణ, వాయుసేన, నౌకాదళ రంగాల్లో భారతదేశానికి అత్యాధుని సాంకేతికత అందిస్తున్నామని చెప్పారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన పుతిన్, ఈ రోజు(డిసెంబర్ 5) సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత, రష్యా సంబంధాలను కొనియాడారు. భారతతో జరిపిన చర్చల ఫలితాలపై తాము పూర్తిగా సంతృప్తి చెందినట్లు వెల్లడించారు. పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం రష్యా నిరంతరం ఇంధనాన్ని రవాణా చేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
Read Also: Vladimir Putin Fitness: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి.. 73 ఏళ్ల వయసులో కూడా..
భారతదేశంలో అతిపెద్ద అణు కర్మాగారాన్ని నిర్మించే ప్రాజెక్టుపై కూడా రష్యా పనిచేస్తోందని, తమిళనాడులోని కడంకుళం అణు విద్యుత్ కేంద్రం గురించి మాట్లాడారు. ఇప్పటికే ఆరు రియాక్టర్లలో రెండింటిని గ్రిడ్లో అనుసంధానించామని, మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. ఇది భారత దేశానికి తక్కువ ఖర్చుతో క్లీన్ ఎనర్జీని ఇస్తుందని చెప్పారు. దీనికి తోడు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఫ్లోటింగ్ అణు విద్యుత్ కేంద్రాలు, వైద్యం-వ్యవసాయ రంగాల్లో అణు సాంకేతిక వినియోగంపై భారత్తో రష్యా సహకారం పెరుగుతుందని పుతిన్ చెప్పారు. గతేడాది ఇరు దేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ 12శాతం పెరిగిందని ఇది 64 బిలియన్ డాలర్లు అని, దీనిని 100 బిలియన్ డాలర్లకు పెంచేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.
ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ విస్తరణతో రవాణా, వాణిజ్య రంగాల్లో కొత్త అవకాలు పెరుగుతాయని పుతిన్ చెప్పారు. భారత్ రష్యా వాణిజ్యంలో 96 శాతం రూపీ-రూబుల్ ద్వారా జరుగుతోందని, త్వరలో యూరేసియన్ ఎకనామిక్ యూనియన్-భారత్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉందని పుతిన్ అన్నారు. వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవి చేపడుతోందని, భారతీయ స్నేహితులకు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని పుతిన్ చెప్పారు.
