Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్‌ ప్రకటనకు రంగం సిద్ధం!

  • బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!
  • కొత్త స్కీమ్‌ ప్రకటనకు రంగం సిద్ధం!
  • 2 వారాల్లో ప్రకటన వెలువడే అవకాశం
Gold

Gold

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏడాది పాటు బంగారం కొనుగోలు ఆపాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ కొనుగోలు తగ్గించారు. తాజాగా బంగారంపై కొత్త స్కీమ్ ప్రకటించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దేశంలో బంగారం దిగుమతులను తగ్గించి.. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను కొత్త రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ స్కీమ్‌ను వచ్చే రెండు వారాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1,000 టన్నులకు పైగా బంగారాన్ని సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

జువెలర్లకు కీలక బాధ్యత

ప్రతిపాదిత కొత్త విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న బంగారు ఆభరణాల వ్యాపారులను (జువెలర్లు) కూడా ‘‘కలెక్షన్ పార్ట్నర్లుగా’’ చేర్చే అవకాశం ఉంది. దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారాన్ని నేరుగా జువెలర్ల ద్వారా ఈ పథకంలో జమ చేసే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ అవకాశం కేవలం బ్యాంకులకు మాత్రమే ఉండేది. ఈ మార్పుతో గృహాల్లో ఉన్న బంగారాన్ని మరింత సులభంగా సమీకరించవచ్చని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ అభిప్రాయపడింది.

నిపుణుల అంచనా ప్రకారం భారతీయ కుటుంబాల దగ్గర ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా 80-90 బిలియన్ డాలర్ల వరకు దేశీయ లిక్విడిటీ అందుబాటులోకి రావచ్చు. ఇది బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఏడాది పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

పాత స్కీమ్ ఎందుకు విఫలమైంది?

2015లో ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం బంగారం దిగుమతులను తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించడం. ఈ పథకం కింద ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో జమ చేసి 2.25 నుంచి 2.5 శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉండేది. అయితే పదేళ్లలో మార్చి 2025 నాటికి కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించబడింది. దేశంలో సుమారు 25,000 టన్నుల బంగారం కుటుంబాల దగ్గర ఉండగా ఇది చాలా తక్కువగా భావిస్తున్నారు.

స్కీమ్ విఫలం కావడానికి కారణాలివే

కుటుంబ వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను కరిగించి జమ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు.
పాత బంగారంపై పన్ను విచారణలు, డాక్యుమెంటేషన్‌పై భయాలు ఉన్నాయి.
బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా వ్యాపార ప్రయోజనం లేకపోవడంతో ప్రచారం చేయలేదు.
బంగారం ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం వడ్డీతో పాటు ధరల పెరుగుదల భారం కూడా భరించాల్సి రావడంతో భారీ ఆర్థిక భారం పడింది.

కొత్త స్కీమ్‌తో ప్రయోజనాలేమిటి?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ విజయవంతమైతే…

బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది.
దేశీయ బంగారం మార్కెట్ మరింత పారదర్శకంగా మారుతుంది.
ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారం ఉత్పాదక ఆస్తిగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది.
రూపాయి విలువ బలపడే అవకాశాలు కూడా ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.