పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని సెగ భారతీయ సామాన్యుడి వంటగది వరకు తాకింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఆయిల్, గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ పరిణామం నేడు దేశవ్యాప్తంగా హోటల్ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ దిగుమతులు తగ్గడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు అవసరమైన గ్యాస్ అందడం లేదు. ఈ సరఫరా నిలిచిపోవడంతో వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా హోటళ్లు తమ బోర్డులను తిప్పేస్తున్నాయి. గ్యాస్ లేనిదే వంటలు చేయడం సాధ్యం కాకపోవడంతో యాజమాన్యాలు హోటళ్లను మూసివేస్తున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు మాత్రం భారాన్ని కస్టమర్లపై వేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు కొనాల్సి వస్తోందని.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచుతున్నామని హోటల్ యజమానులు వాపోతున్నారు.
గతంలో రూ.40 ఉన్న టిఫిన్ ధర ఇప్పుడు రూ.60 నుంచి రూ.70కి చేరింది. సాధారణ ప్లేట్ మీల్స్ ధరపై 20 శాతం నుంచి 30 శాతం వరకు అదనపు భారం పడింది. చాయ్, కాఫీ వంటి కనీస అవసరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారాయి. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో దీని ప్రభావం అధికంగా పడింది. కర్రీ పాయింట్ లో కూడా అదనపు డబ్బులు వసూలు చేయడం గమనార్హం.
నిన్నటి వరకు సాధారణంగా ఉన్న ధరలు, నేడు రెట్టింపు కావడంతో బయట తినే వారు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, బ్యాచిలర్లు, కూలీలు హోటల్ ధరలు చూసి కంగారు పడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో గ్యాస్, ఆయిల్ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం హోటల్ రంగమే కాకుండా.. రవాణా, నిత్యావసర వస్తువుల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
