ఎల్నినో భయాలు, రుతుపవనాల లోటు ప్రభావం నేపథ్యంలో రాబోయే ఖరీఫ్ సీజన్ను రక్షించేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్త ముందస్తు చర్యలను ప్రారంభించింది. జూన్ 23 నాటికి నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 43 శాతం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉన్న 315 జిల్లాలను గుర్తించి, తక్షణమే ఆయా రాష్ట్రాల్లో అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది.
సాగునీటి లభ్యత ఆధారంగా జిల్లాల వర్గీకరణ
వర్షపాత లోటును తట్టుకునే సామర్థ్యం ఆధారంగా మంత్రిత్వ శాఖ ఈ జిల్లాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. అత్యంత ప్రమాదకరమైన వాటిలో 25 శాతం కంటే తక్కువ సాగునీటి సౌకర్యం ఉన్న 111 జిల్లాలు. వీటిలో మహారాష్ట్రలోనే సుమారు 20 జిల్లాలు ఉన్నాయి. మధ్యస్థ ప్రమాదకరమైనవి.. 25 నుండి 50 శాతం సాగునీటి వసతి కలిగిన 76 జిల్లాలు, తక్కువ ప్రమాదకరమైనవి.. 50 శాతం కంటే ఎక్కువ సాగునీటి సౌకర్యం ఉన్న 128 జిల్లాలు.
ఈ ప్రభావిత జిల్లాలు ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. జూన్ 1-24 నాటి వర్షపాత నివేదికల ప్రకారం.. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పశ్చిమ రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలన్నీ తీవ్ర తేమ కొరతను ఎదుర్కొంటున్నాయి.
ప్రభుత్వం సూచించిన వ్యూహాలు..
రుతుపవనాల బలహీన ప్రభావం నుంచి పంటలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా కరవును తట్టుకునే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు (మిల్లెట్స్), నూనెగింజల సాగును ప్రోత్సహించడం. వర్షాలు ఆలస్యమైనా తక్కువ రోజుల్లో చేతికొచ్చే స్వల్పకాలిక పంట రకాలను రైతులకు అందుబాటులో ఉంచడం.. చెరువుల మరమ్మతులు, చెక్ డ్యామ్ల పునరుద్ధరణ, కాలువల పూడికతీత మరియు నీటి నిల్వ నిర్మాణాల విస్తరణ చేపట్టడం. అదనంగా.. క్షేత్రస్థాయిలో వర్షపాత సరళి, పంటల పరిస్థితి, విత్తనాలు నాటే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ‘ఎల్నినో మానిటరింగ్ సెల్’, ‘క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్’లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

