BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!

Brics

Brics

BRICS Summit 2026: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ భారత్ తన దౌత్య వ్యూహాన్ని మరింత పదును పెడుతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌కు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఇరాన్‌కు అండగా నిలిచినందుకు మొదట భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌తో భారత్ కొనసాగిస్తున్న దౌత్యం కేవలం ద్వైపాక్షిక సంబంధాల పరిరక్షణకే పరిమితం కాకుండా.. దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలతోనూ ముడిపడి ఉందని పేర్కొన్నారు.

ఇరాన్ నుంచి బయలుదేరే ముందు పజెష్కియాన్ బ్రిక్స్ లక్ష్యాలను ప్రస్తావించారు. ఏకపక్ష ఆలోచనా విధానాన్ని ఎదుర్కోవడం, సభ్య దేశాల మధ్య ఐక్యత, స్వాతంత్య్రం, ప్రతిఘటన, బలం, ఆవిష్కరణలను పెంచడం బ్రిక్స్ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచం అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని.. భౌగోళిక రాజకీయ పరిణామాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ఆర్థిక ఒత్తిళ్లు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ 12 రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ అయ్యారు. ఆగస్టు 31న కిర్గిజిస్థాన్‌లోని బిష్కెక్‌లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. తాజాగా సెప్టెంబర్ 11న పజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. అలాగే ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయనకు ఇదే తొలి భారత్ పర్యటన. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం ఇదే. మరోవైపు అమెరికా నుంచి వివిధ రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇరాన్‌తో భారత్ తన సంభాషణను కొనసాగిస్తోంది. విదేశాంగ విధానాన్ని ఇతర దేశాల ఒత్తిళ్లకు అనుగుణంగా కాకుండా.. భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తున్నామనే సంకేతాన్ని ఢిల్లీ ఇస్తోంది.

బ్రిక్స్ సమావేశంలో పశ్చిమాసియాకు సంబంధించిన మరో కీలక దృశ్యం కనిపించింది. ఒకవైపు ఇరాన్ ఉండగా.. మరోవైపు సౌదీ అరేబియా, యూఏఈ కూడా వేదికపై ఉన్నాయి. ఈ మూడు దేశాలకు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఒకే విధమైన అభిప్రాయాలు లేకపోయినా.. భారత్ మాత్రం అందరితోనూ చర్చలు కొనసాగిస్తోంది. ఇరాన్‌తో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూనే.. సౌదీ అరేబియా, యూఏఈతో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో సంబంధాలను బలోపేతం చేస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తోనూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. అంటే పశ్చిమాసియాలో ఏదో ఒక కూటమి వైపు పూర్తిగా మొగ్గకుండా.. అన్ని వైపులా భారత ప్రయోజనాలకు అనుగుణంగా సంబంధాలను కొనసాగించడమే వ్యూహంగా కనిపిస్తోంది.

మోదీ, పజెష్కియాన్ చర్చల్లో చాబహార్ పోర్టు, వాణిజ్య అనుసంధానం కీలక అంశాలుగా నిలవనున్నాయి. పాకిస్థాన్‌ను పక్కనపెట్టి ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ద్వారా మధ్య ఆసియా, రష్యా, యూరప్ మార్కెట్లకు నేరుగా చేరుకునే మార్గాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. ఈ మార్గంలో చాబహార్‌లోని షాహిద్ బెహెష్టీ టెర్మినల్ కీలక పాత్ర పోషిస్తోంది. ముంబై నుంచి సముద్ర మార్గంలో చాబహార్ చేరిన సరుకు అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా మధ్య ఆసియా దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలను అనుసంధానిస్తూ ఈ మార్గం ముందుకు సాగుతుంది. ఆ తరువాత ఇరాన్‌లోని బందర్-ఎ అంజలీ మీదుగా కాస్పియన్ సముద్రం చేరుకుని.. అక్కడి నుంచి రష్యా వైపు వాణిజ్య మార్గాన్ని కలుపుతుంది.

ఈ మొత్తం వ్యవస్థ అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ)లో భాగం. దాదాపు 7,200 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ రవాణా మార్గం భారత్‌ను రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ వంటి నగరాలతో అనుసంధానించే లక్ష్యంతో ఉంది. అక్కడి నుంచి యూరప్‌లోని ఇతర దేశాలకు కూడా వాణిజ్య అనుసంధానం విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ మార్గం ద్వారా పాకిస్థాన్‌ను దాటకుండా భారత్ రష్యా, యూరప్‌కు చేరుకోవచ్చు. అలాగే సంప్రదాయ స్వేజ్ కాలువ మార్గంపై ఆధారపడటాన్ని కూడా కొంత మేర తగ్గించుకోవచ్చు. దీంతో రవాణా సమయం, ఖర్చు తగ్గే అవకాశం ఉండటంతో పాటు భారత ఎగుమతులు, దిగుమతులకు కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది.

చాబహార్ ప్రాజెక్టులో భాగంగా భారత్, ఇరాన్ మధ్య 2024 మేలో షాహిద్ బెహెష్టీ టెర్మినల్ నిర్వహణకు సంబంధించి పదేళ్ల ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ పెట్టుబడులు, క్రెడిట్ సౌకర్యాలను కూడా ప్రకటించింది. అయితే ఇరాన్‌పై కొనసాగుతున్న అంతర్జాతీయ ఆంక్షలు, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఈ ప్రాజెక్టుకు సవాళ్లుగా మారుతున్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి భారత్‌కు ముడి చమురు, ఎల్‌పీజీ సరఫరాలను పెంచే అంశం కూడా కీలకంగా మారింది. ఇరాన్ నుంచి చౌకైన ఇంధనాన్ని పొందడం భారత్‌కు ప్రయోజనకరంగా ఉండొచ్చు. అయితే ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు ఈ వాణిజ్యానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.

ప్రస్తుతం భారత్‌కు అత్యంత కీలకమైన అంశాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచ ఇంధన రవాణాలో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ముడి చమురు, గ్యాస్ ధరలు, సముద్ర రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రత్యామ్నాయ వాణిజ్య, ఇంధన మార్గాలను అభివృద్ధి చేయడం భారత్‌కు వ్యూహాత్మక అవసరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాబహార్, ఐఎన్‌ఎస్‌టీసీ వంటి ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

మొత్తంగా.. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో భారత్ అనుసరిస్తున్న దౌత్య విధానం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇరాన్‌తో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తూనే.. యూఏఈ, సౌదీ అరేబియాతో వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తోనూ భారత్ తన వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. అందువల్ల ఏదో ఒక దేశం లేదా కూటమి వైపు పూర్తిగా మొగ్గకుండా.. అన్ని దేశాలతోనూ సంభాషిస్తూ భారత ఆర్థిక, ఇంధన, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. యుద్ధం, అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఇంధన సంక్షోభం వంటి సవాళ్ల మధ్య భారత్ పంపుతున్న సందేశం స్పష్టంగా ఉంది.. సంబంధాలు అందరితో ఉంటాయి.. కానీ తుది నిర్ణయాలు మాత్రం భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఉంటాయి.