Site icon NTV Telugu

LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం

Gas

Gas

పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌లో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. దేశంలో ఎల్‌పీజీ కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ESMA) అధికారాలను వినియోగిస్తూ దేశంలోని ఆయిల్ రిఫైనరీలకు ఎల్‌పీజీ ఉత్పత్తిని వెంటనే పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించింది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసింది. గ్యాస్ సరఫరా అంతరాయం కారణంగా కొన్ని రాష్ట్రాల్లో హోటళ్లు, ఆహార వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

అధికారుల వివరాల ప్రకారం.. వాణిజ్య, గృహ అవసరాల కోసం ఎల్‌పీజీపై డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రిఫైనరీలు ఉత్పత్తిని పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. ఎస్మా చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అత్యవసర సేవలను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ చట్టం కింద అవసరమైన సేవలను అందించే సంస్థలు తమ కార్యకలాపాలను ఆపకుండా కొనసాగించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా కూడా ప్రజల దైనందిన జీవితానికి కీలకమైనదిగా భావించి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇకపోతే ఇటీవల కొన్ని నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్ పరిశ్రమ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. సరఫరా అంతరాయం వల్ల అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కేంద్రం ఉత్పత్తి పెంపుతో పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలోనే తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version