GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

Gst

Gst

భారత ఆర్థిక వ్యవస్థ జోరును చాటుతూ.. సరుకులు, సేవల పన్ను (GST) వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఏప్రిల్ నెల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ జీఎస్టీ వసూళ్లు చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరాయి.

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. 

ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026 నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 2.43 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన రూ. 2.23 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం వృద్ధి. రిఫండ్‌లను తీసివేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 7.3 శాతం ఎక్కువ. దిగుమతుల ద్వారా వచ్చే రాబడి ఈసారి వసూళ్లకు ప్రధాన ఇంజన్‌గా నిలిచింది. దిగుమతులపై జీఎస్టీ ఏకంగా 25.8 శాతం పెరిగి రూ. 57,580 కోట్లకు చేరింది.

దేశీయంగా జరిగిన లావాదేవీల ద్వారా వసూళ్లు 4.3 శాతం వృద్ధి చెంది రూ. 1.85 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను స్థూల జీఎస్టీ రాబడి 8.3 శాతం పెరిగి రూ. 22.27 లక్షల కోట్లకు చేరుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక , గుజరాత్ వంటి రాష్ట్రాలు ఎప్పటిలాగే జీఎస్టీ వసూళ్లలో సింహభాగాన్ని అందించాయి. రిఫండ్‌ల చెల్లింపులు కూడా ఈసారి 19.3 శాతం పెరగడం గమనార్హం. మార్చి నెలలో కూడా రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటిన వసూళ్లు, ఏప్రిల్‌లో మరింత పెరగడం భారత ఆర్థిక రంగ స్థిరత్వానికి నిదర్శనం.