దాదాపు 2 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), తమిళనాడులో డీఎంకే ఓటమి తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ నుంచి సుప్రియా సూలే వంటి నేతలు హాజరయ్యారు. తమిళనాడులో కాంగ్రెస్తో విభేదాల కారణంగా డీఎంకే ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేసింది. ఇక ఆప్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
ఉద్ధవ్ ఠాక్రే వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ నుండి అఖిలేష్ యాదవ్, సీపీఎం నుండి జాన్ బ్రిట్టాస్, సీపీఐ నుండి డి రాజా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుండి పీకే కుంజలికుట్టి, కేరళ కాంగ్రెస్ నుండి జోస్ కే మణి, ఆర్ఎస్పీ నుండి ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నుండి టి తిరుమావళవన్, ఎండీఎంకే నుండి వైకోలు హాజరయ్యారు.
అయితే, తమిళనాడు నుంచి డీఎంకే హాజరు కాలేదు. కానీ ఇదే సమయంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం విజయ్ పార్టీ టీవీకేను ఎందుకు ఆహ్వానించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. దశాబ్ధాల డీఎంకే, అన్నాడీఎంకేలా ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టిన పార్టీని ఆహ్వానించకపోవడం ఏంటని పలువురు అనుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.
ఇండియా కూటమి సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదనే దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్లో సభ్యత్వం ఉన్న పార్టీలను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు చెప్పింది. విజయ్ టీవీకే పార్టీకి పార్లమెంట్లో ఏ సభలో కూడా ప్రతినిధులు లేరు. అందుకే ఇండియా బ్లాక్ సమావేశానికి ఆహ్వానించలేదని చెప్పింది.

