Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి కోసం అనేక కీలక సంస్కరణలు అమలు చేసిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మైనింగ్, కోల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. గతంలో బొగ్గు రంగం అవినీతి, అక్రమాలు, అరకొర నిధులతో ఇబ్బందులు ఎదుర్కొనేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రంగం పూర్తిగా రూపాంతరం చెందిందన్నారు.
కోల్ రంగంలో సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని.. అప్పటి కేంద్ర బొగ్గు మంత్రి జైలుకు వెళ్లిన పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కోల్ రంగం పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. ప్రపంచంలో బొగ్గు వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని, దేశ విద్యుత్ ఉత్పత్తిలో 72% బొగ్గుపైనే ఆధారపడి ఉందని మంత్రి వివరించారు. ఈ ఏడాది దేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపడేలా 80 రోజుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా కోల్ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు.
స్టీల్, ఎరువుల పరిశ్రమలతో పాటు అనేక రంగాలకు బొగ్గు కీలక ముడి పదార్థమని పేర్కొన్న కిషన్ రెడ్డి, గతంలో విదేశాల నుంచి భారీగా బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేశీయ ఉత్పత్తి పెరగడంతో దిగుమతులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. మైనింగ్ ప్రాంతాల్లో రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ రవాణా ఖర్చులు తగ్గించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. క్రిటికల్ మినరల్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొందని, వాటి కోసం దేశాధినేతలను కూడా కిడ్నాప్ చేసే స్థాయికి పరిస్థితులు వెళ్లాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్కు ఒక పొరుగు దేశం కీలక ఖనిజాల సరఫరాను నిలిపివేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో కూడా కీలక ఖనిజాల సరఫరాపై వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని చెప్పారు.
కోల్ ఆధారంగా సింథటిక్ గ్యాస్ తయారీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల వంటి పరిస్థితుల వల్ల ఇంధన దిగుమతులపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరుల అభివృద్ధి అవసరమని అన్నారు. దేశంలో 187 బొగ్గు గనులు ఉన్నాయని, వినియోగం పూర్తైన గనులను శాస్త్రీయ పద్ధతుల్లో మూసివేస్తున్నామని మంత్రి తెలిపారు. మూసివేసిన గనుల్లో పెద్ద ఎత్తున వృక్షారోపణ, పర్యాటక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ గనులను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, గిన్నిస్ బుక్ రికార్డుకు కూడా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గనుల ప్రభావిత గ్రామాల అభివృద్ధికి 2% నిధులు కేటాయించాలని చట్టం చేసినప్పటికీ, ఆ నిధులను జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. కలెక్టర్లను అడిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదనే సమాధానం వస్తోందని చెప్పారు. సింగరేణి కాలరీస్ వ్యవహారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని పేర్కొన్న ఆయన, గతంలో డీఎంఎఫ్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు. సింగరేణి ఆర్థిక భారం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని, ఉద్యోగుల కోసం బీమా సదుపాయాలు కూడా తీసుకొచ్చామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

