Site icon NTV Telugu

Sikandar Raza: చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. సూర్యకుమార్‌తో కలిసి..!

Sikandar Raza

Sikandar Raza

Zimbabwe Captain Sikandar Raza History in T20 Cricket: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం భారత్‌తో జరిగిన మొదటి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రజా నిలిచాడు. 19 బంతుల్లో 17 రన్స్ చేసిన రజా.. బౌలింగ్‌లో మూడు వికెట్స్ పడగట్టాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 125 మ్యాచ్‌ల్లో 16 సార్లు అవార్డు సాధించాడు. సికిందర్ రజా 87 మ్యాచ్‌ల్లో 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సూర్యకుమార్ యాదవ్‌ 68 మ్యాచ్‌ల్లో 15 సార్లు ఈ అవార్డు దక్కించుకున్నాడు. విరాట్ అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం రజా, సూర్య ముందుది.

Also Read: IND vs ZIM: విశ్వవిజేత టీమిండియాపై విజయం.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే!

మొదటి టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. మడాండే (29 నాటౌట్‌; 25 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (4/13) నాలుగు వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ (2/11) రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (31; 29 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. రజా (3/25), చటార (3/16) సత్తాచాటారు.

Exit mobile version