Ind vs SL: ‘జడేజా’ రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!

  • శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు 15 మంది సభ్యులభారత జట్టు ప్రకటన
  • కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ , వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..
  • రవీంద్ర జడేజా టెస్టు జట్టులోకి రీఎంట్రీ..
  • మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సరన్ష్ జైన్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు..
Ind Vs Sl

Ind Vs Sl

Ind vs SL: ఆగస్టులో జరగనున్న భారత్, శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జట్టులోకి సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం కాగా, యువ స్పిన్ ఆల్‌రౌండర్ సరన్ష్ జైన్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.

జడేజా రీఎంట్రీ:

గత ఐపీఎల్ 2026 సీజన్‌లో టెన్నిస్ ఎల్బో గాయానికి గురైన రవీంద్ర జడేజా పూర్తిగా కోలుకుని మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండే నేపథ్యంలో జడేజా అనుభవం భారత జట్టుకు ఎంతో కీలకంగా మారనుంది. అతడితో పాటు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ స్పిన్ విభాగంలో ఎంపికయ్యారు.

సరన్ష్ జైన్‌కు తొలి అవకాశం:

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సరన్ష్ జైన్‌కు అవకాశం కల్పించారు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సరన్ష్ జైన్.. 42 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 131 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 1,455 పరుగులు చేసి ఒక సెంచరీ, ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశాడు. ఇండియా-ఏ తరఫున శ్రీలంక-ఏపై కూడా బాగా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

బుమ్రా, సాయి సుదర్శన్‌కు ఫిట్‌నెస్ పరీక్ష:

ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. వీరిద్దరి ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే వీరు మ్యాచ్‌లు ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

శ్రీలంక పర్యటనకు ముందు ఆగస్టు 7 నుంచి కొలంబోలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరగనుంది. గత సీజన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో వెనుకబడింది. ముఖ్యంగా గువాహటిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవడం భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయంగా నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనలో విజయం సాధించి WTC పాయింట్ల పట్టికలో పుంజుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (C), కేఎల్ రాహుల్ (VC), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (WK), సాయి సుదర్శన్ *, ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా *, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్.