IND vs NZ 2nd Test: నాలుగో ఇన్నింగ్స్‌ ఆడలేం.. 200 ప్లస్ లీడ్‌ ఉంటేనే గెలుపై అవకాశాలు!

  • 200 ప్లస్ లీడ్‌ ఉంటేనే అవకాశాలు
  • తొలిరోజు నుంచే స్పిన్నర్ల ప్రభావం
  • నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ అత్యంత కఠినం
Yashasvi Jaiswal, Shubman Gill

Yashasvi Jaiswal, Shubman Gill

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ చేశారు. టెస్ట్ మొదటిరోజు చివరి సెషన్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి భారీగా పరుగులు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. బౌలర్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలంటే.. బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. భారత్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇదే మంచి అవకాశం అని చెప్పాలి.

పూణే పిచ్‌పై తొలిరోజు నుంచే స్పిన్నర్లు ప్రభావం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ అత్యంత కఠినం అం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ్సరం లేదు. లక్ష్య ఛేదనలో 150-170 పరుగులు చేయడం కూడా కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అందుకే టాస్‌ గెలిచిన కివీస్ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. బంతి గింగిరాలు తిరుగుతున్నా.. న్యూజిలాండ్‌ మంచి స్కోర్ చేసింది. ఇక భారత్ రేసులో నిలవాలంటే.. రెండో రోజు ఆటతో పాటు మూడో రోజు కూడా బ్యాటింగ్‌ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 450కి పైగా పరుగులు చేసి.. 200 ప్లస్ లీడ్‌ ఉంటే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు.

Also Read: Yuvraj Singh: మీ ఆరెంజ్‌లను చెక్ చేసుకోండి.. యువరాజ్ సింగ్ యాడ్‌పై విమర్శలు!

ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్‌ (6), శుబ్‌మన్‌ గిల్‌ (10) ఉన్నారు. గిల్‌ కాస్త వేగంగా ఆడినా.. యశస్వి తన దూకుడుకు భిన్నంగా ఆడాడు. ఈ ఇద్దరు మంచి భాగస్వామ్యం నిర్మించాల్సి ఉంది. రెండోరోజు తొలి సెషన్‌ అత్యంత కీలకం. పేస్‌కు కాస్త సహకారం లభించే అవకాశం ఉంది. ఈక్రమంలో వీరు కాస్త ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. గత టెస్టులో రాణించిన సర్ఫరాజ్‌ ఖాన్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీలపై భారీ ఆశలు ఉన్నాయి. పూణేలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు (254)ను ఇక్కడే సాధించాడు. సర్ఫరాజ్‌, రిషబ్ రాణిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయడం పక్కా.