బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడోరోజు ఆట ముగిసేసరికి 231/3 స్కోరుతో నిలిచింది. రోహిత్ సేన ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ (70) అవుట్ కాగా.. క్రీజ్లో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ టీమిండియాకు అత్యంత కీలకం. వికెట్స్ కోల్పోకుండా స్కోర్ చేస్తేనే రేసులో నిలవొచ్చు. అయితే టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఫలితం మరోసారి పునరావృతం అవుతుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also Read: IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్కు పంత్!
భారత జట్టు కమ్బ్యాక్తో మ్యాచ్ రసవత్తరంగా మారుతుందని, టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఫలితం రిపీట్ అవుతుందని సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. ‘నేడు న్యూజిలాండ్ ఆటగాడినైతే.. భారత్ కమ్బ్యాక్తో కాస్త ఆందోళన చెందేవాడిని. ఎందుకంటే ఈ జట్టుకు గొప్పగా పుంజుకునే నైపుణ్యం ఉంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. ఓ దశలో భారత జట్టుకు ఓటమి ఖాయమని అంతా భావించారు. ఆ సమయంలో అద్భుతంగా పోరాడి గెలిచింది. ఇప్పుడు న్యూజిలాండ్పై మరోసారి అదే ఫలితాన్ని చూడబోతున్నాం. భారత్ కమ్బ్యాక్తో మ్యాచ్ రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నా’ అని మంజ్రేకర్ ఎక్స్లో పేర్కొన్నాడు.