NTV Telugu Site icon

IND vs IRE: అదే పెద్ద తలనొప్పిగా మారింది: జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah New

Jasprit Bumrah New

India Captain Jasprit Bumrah React on IND vs IRE 2nd T20I: ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగన రెండో టీ20లో యువ భారత్ సత్తాచాటింది. రెండో టీ20 మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానేకైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజు శాంసన్‌, రింకూ సింగ్ చెలరేగితే.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్‌ రాణించారు. మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు. సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని, ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకోవడం మాత్రం పెద్ద తలనొప్పిగా ఉందని తెలిపాడు.

‘ఐర్లాండ్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిచ్‌ కాస్త పొడిగా ఉంది. అందుకే తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. బాయ్స్‌ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. అయితే తుది జట్టును ఎంపిక చేసుకోవడం ఎప్పుడూ కష్టమే. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ జాతీయ జట్టులో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. తుది జట్టులో ఆడేందుకు తీవ్రంగా కష్డపడుతున్నారు’ అని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు.

Also Read: Rinku Singh: అక్కడుంది రింకూ సింగ్.. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా బాదుడు మాత్రం సేమ్!

‘ఎవరైనా నిరంతరం కష్టపడతూ ఉండాలి. ఎదో ఒక రోజు మన శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా దక్కుతుంది. ఏ మ్యాచ్‌లో అయినా భారీ అంచనాలతో బరిలోకి దిగితే ఎక్కువ ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. అందుకే అంచనాలను పక్కన పెట్టేసి మైదానంలోకి అడుగు పెట్టాలి. భారీ అంచనాలతో ఆడితే.. న్యాయం చేయడానికి 100 శాతం కష్టపడటం సాధ్యం కాదు’ అని టీమిండియా కెప్టెన్ బుమ్రా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 15 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. దాదాపుగా 11 నెలల తర్వాత మైదానంలోకి బరిలోకి దిగిన బుమ్రా సత్తాచాటుతున్నాడు.