IND vs ENG: అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: జోస్ బట్లర్

  • మూడో టీ20లో భారత్ ఓటమి
  • అదిల్ రషీద్ మా జట్టులో ఉండటం అదృష్టం
  • 4 ఓవర్లలో 15 పరుగులే
Jos Buttler Speech

Jos Buttler Speech

ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌పై ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించాడు. రషీద్‌ కారణంగానే భారత్‌తో జరిగిన మూడో టీ20లో గెలిచామని చెప్పాడు. రషీద్ తమ జట్టులో ఉండటం అదృష్టం అని, వైవిధ్యంగా బంతులేయడం అతడి స్పెషాలిటీ అని పేర్కొన్నాడు. రషీద్, మార్క్‌ వుడ్ కలిసి ఇన్నింగ్స్ చివరలో విలువైన పరుగులు చేయడం కూడా కలిసొచ్చిందని బట్లర్ చెప్పుకొచ్చాడు. మంగళవారం రాత్రి భారత్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 145 పరుగులే చేసింది.

మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ మాట్లాడుతూ… ‘మా బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు. మా కుర్రాళ్లు మంచి నైపుణ్యాలను ప్రదర్శించారు. పిచ్‌ నుంచి మంచి సహకారం అందింది. మా బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఆదిల్ రషీద్ మా జట్టులో ఉండటం అదృష్టం. వైవిధ్యంగా బంతులు వేయడం అతడి స్పెషాలిటీ. ఈ మ్యాచులో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ లయ అందుకున్నాడు. నిలకడగా బౌలింగ్‌ చేశాడు. బెన్ డకెట్ నాణ్యమైన ఆటను ప్రదర్శించాడు. రషీద్, మార్క్‌ వుడ్ ఇన్నింగ్స్ చివరలో విలువైన పరుగులు చేశారు. మా విజయానికి వారు కూడా ఓ కారణం’ అని చెప్పాడు. మూడో టీ20లో రషీద్‌ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కీలక బ్యాటర్ తిలక్ వర్మ (18)ను క్లీన్‌ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.