IND vs ENG: భారత్‌ది కూడా ‘బజ్‌బాల్’ ఆటే.. బిత్తరపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్! ఆధిక్యం 166

  • రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతున్న భారత్
  • 70 బంతుల్లో ఆకాశ్ దీప్ అర్ధ శతకం
  • జైస్వాల్ 106 బంతుల్లో 85 రన్స్
  • భారత్ ఆధిక్యం 166 రన్స్
India Bazball

India Bazball

Team India Plays Bazball in IND vs ENG 5th Test 2025: ఇటీవలి కాలంలో ‘బజ్‌బాల్’ క్రికెట్ అంటూ.. ఇంగ్లండ్‌ టెస్టుల్లో దూకుడైన ఆట తీరును ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. వేగంగా పరుగులు చేసి.. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచి ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ టీమ్ ఆడుతోంది. బజ్‌బాల్ ఆటతో చాలా మ్యాచ్‌లను కూడా గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా ఇంగ్లండ్‌ తన బజ్‌బాల్ ఆటను కొనసాగిస్తోంది. ఐదవ టెస్ట్ మ్యాచ్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కూడా బజ్‌బాల్ ఆటను ఆడుతోంది.

రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 75/2తో ఆటను ప్రారంభించిన భారత్.. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి మరో వికెట్‌ కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్, యశస్వి జైస్వాల్ ఇద్దరు ధాటిగా ఆడారు. ముఖ్యంగా ఆకాశ్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. జైస్వాల్ కూడా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఆకాశ్ 70 బంతుల్లో అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 150 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ తర్వాత నాలుగు ఫోర్లు బాదిమా ఆకాష్.. ఒవర్టన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 94 బంతుల్లో 12 ఫోర్లతో 66 రన్స్ చేశాడు.

Also Read: Akash Deep Fifty: ఆకాశ్‌ దీప్ సూపరో సూపర్.. హాఫ్ సెంచరీ వీడియో వైరల్!

ఆకాశ్ దీప్ అవుట్ అనంతరం శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. 8 బంతుల్లో 11 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85 రన్స్ చేశాడు. యశస్వి సెంచరీకి చేరువయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి 44 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి 189 రన్స్ చేసింది. భారత్ రన్ రేట్ 4.3గా ఉంది. భారత్‌ ‘బజ్‌బాల్’ ఆటను చూసి ఇంగ్లండ్ ప్లేయర్స్ బిత్తరపోతున్నారు. రెండో సెషన్‌లో కూడా యశస్వి, గిల్ ఇదే ఆట ఆడితే.. భారత్ ఆధిక్యం 250 ప్లస్ అవుతుంది.