కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా రద్దైంది. రెండో రోజు మాదిరిగానే.. ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది. మూడో రోజైన ఆదివారం వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. మూడోసారి పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు పిచ్, మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. మైదానం చిత్తడిగా ఉండడంతో.. మళ్లీ 12 గంటలకు పరిశీలించారు. అప్పటికీ మైదానం సిద్ధంగా లేకపోవడంతో ఆటను మళ్లీ వాయిదా వేశారు. ఇక 2 గంటలకు మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. కాస్త ఎండ వచ్చినా ఆడేందుకు మైదానం సరిగ్గా లేదు. నీటిశాతం ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉండనే ఉద్దేశంతో మూడో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటే.. మ్యాచ్ దాదాపు డ్రా కావడం ఖాయం.
Also Read: Rohit Sharma: అతడు ఎవరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. మొదటి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి బంగ్లా 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్ (6) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ 2 వికెట్స్ పడగొట్టారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో (31), షెడ్మన్ ఇస్లామ్ (24) రన్స్ చేశారు.