NTV Telugu Site icon

Nithish Kumar Reddy: అదే నా చిన్నప్పటి కల: నితీశ్‌ రెడ్డి

ఆస్ట్రేలియాపై ఆడాలనేది తన చిన్నప్పటి కల అని తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి తెలిపాడు. ప్రతి క్రికెటర్‌కు దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడటం గౌరవంగా భావిస్తాడని, తనకు ఇప్పుడు అలాంటి అవకాశం రానుండటం ఆనందంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్‌లో ఆడానని, ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా బరిలోకి దిగాల్సి ఉంటుందని నితీశ్‌ చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు నితీశ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. పేస్ ఆల్‌రౌండర్‌ లోటును నితీశ్‌తో బీసీసీఐ భర్తీ చేసింది.

తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడాడు. ‘ప్రతి క్రికెటర్‌కు దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడటంను గౌరవంగా భావిస్తాడు. నాకు అలాంటి అవకాశం రానుండటం చాలా ఆనందంగా ఉంది. 2024లో నాకు ప్రతిదీ మంచే జరుగుతోంది. ఆ దేవుడికి కృతజ్ఞతలు. తప్పకుండా మంచి ఆల్‌రౌండర్‌గా రాణిస్తాననే నమ్మకం ఉంది. ఆస్ట్రేలియా జట్టుతో ఆడటం ఎప్పుడూ సవాలే. నాకు అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి ఆసీస్‌పై ఆడాలనే కల ఉంది. ఇప్పుడు అది నెరవేరుతుందనుకుంటున్నా. ఇప్పుడు ఇండియా-A మ్యాచ్‌పైనే దృష్టి పెట్టా. ఐపీఎల్‌ ఆసీస్‌ కెప్టెన్ పాట్ కమిన్స్‌ నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్‌లో ఆడాను. ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా ఆడాల్సి ఉంటుంది’ అని నితీశ్‌ చెప్పాడు.

ఐపీఎల్‌ 2024లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున నితీశ్‌ రెడ్డి సత్తాచాటాడు. 303 పరుగులు చేసి.. 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ 21 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన నితీశ్‌.. 708 పరుగులు, 55 వికెట్లు తీశాడు.

Also Read: India Head Coach: గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్!

ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్, బుమ్రా, జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్, కోహ్లీ, రాహుల్, పంత్, సర్ఫరాజ్, జూరెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్‌, హర్షిత్‌ రాణా, నితీశ్‌, సుందర్‌.