Nitish Reddy: అదృష్టం అంటే నితీశ్ రెడ్డిదే.. 7 నెలల్లోనే ప్రతిష్ఠాత్మక ట్రోఫీలో ఛాన్స్!

  • తొలి టెస్ట్‌లో బరిలోకి నితీశ్ రెడ్డి
  • పెర్త్ టెస్ట్‌లో 41 పరుగులు
  • ఆల్‌రౌండర్‌గా సేవలు ఖాయం
Nitish Reddy Journey

Nitish Reddy Journey

తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బరిలోకి దిగాడు. ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్న నితీశ్.. అదే ఉత్సహంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ తడబడిన ఆ పిచ్‌పై 41 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతడే టాప్‌ స్కోరర్‌. కీలక ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఒక్క ఐపీఎల్ సీజన్‌తో అతడి తలరాతే మారిపోయింది.

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ రెడ్డి అరంగేట్రం చేశాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. నాలుగో మ్యాచ్‌లో ఛాన్స్ వస్తే.. 14 పరుగులు చేసి నిరాశపర్చాడు. తర్వాత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 64 రన్స్ చేశాడు. అదే మ్యాచ్‌లో ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో మొత్తంగా 303 పరుగులు, 3 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ప్రదర్శనతో అతడికి భారత జట్టులో చోటు దక్కింది.

Also Read: KL Rahul: అరుదైన క్లబ్‌లో కేఎల్‌ రాహుల్‌!

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో నితీశ్ రెడ్డికి మొదటిసారి అవకాశం వచ్చింది. రెండో టీ20లో 74 పరుగులు, 2 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో రాణించడంతో ఏకంగా టెస్టు జట్టులో చోటు దక్కింది. బోర్డర్-గవాస్కర్ లాంటి ప్రతిష్ఠాత్మక ట్రోఫీలో తుది జట్టులో అతడికి ఛాన్స్ దొరకడం కష్టమనుకున్నారు అందరూ. కానీ నెట్ సెషన్లలో నితీశ్ బ్యాటింగ్‌, బ్యాటింగ్‌ చూసిన టీమ్ మేనేజ్‌మెంట్‌.. పెర్త్ టెస్టులో అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతడు రెండుచేతులా అందిపుచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో భారత జట్టుకు నితీశ్ ఆల్‌రౌండర్‌గా సేవలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది.